ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్ల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలు, పోలీసుల మధ్య ఉన్న సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు.
గోల్కొండ: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్ల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలు, పోలీసుల మధ్య ఉన్న సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్లో మసీదుల నిర్వహణ కమిటీలు, బస్తీ సంక్షేమ సంఘం, మైత్రీ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం నేరస్తుల ఆటను కట్టించేదిగా ఉందని, దీని వల్ల కాలనీలు, బస్తీలలో చోరీల సంఖ్య తగ్గిందని అన్నారు. చోరీలను పూర్తిగా నివారించేందుకు కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగరంలో సంచలనం సృష్టించిన దొంగతనాలు సీసీ టీవీ పుటేజిల కారణంగా ఛేదింపబడ్డాయని ఆయన అన్నారు.
కాలనీలవారితో పాటు వ్యాపారులు ప్రార్థనా స్థలాల నిర్వహణ కమిటీల వారు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి సీసీ కెమెరాల కంపెనీల వారితో మాట్లాడి డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ఒప్పించడం జరిగిందన్నారు. కాగా రంజాన్ మాసంలో మసీదుల నిర్వహణ కమిటీల వారు మసీదు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేయాలన్నారు. దీనికి బల్దియా వారితో పాటు అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం కూడా తీసుకోవాలన్నారు. ఎంతో ఈ పవిత్రమైన ఈ మాసంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మైత్రి సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.