డాక్టర్‌ దంపతుల నుంచి మరెంత మందికో..?  | Corona virus Spread From Community Transmission | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ దంపతుల నుంచి మరెంత మందికో..? 

Mar 27 2020 9:30 AM | Updated on Mar 27 2020 1:03 PM

Corona virus Spread From Community Transmission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకరి తర్వాత మరొకరు కరోనా లక్షణాలతో  ఆస్పత్రుల్లో చేరుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 27 కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఒక భార్య....ఒక కుమారుడు....ఇంకొక తల్లి ....ఇలా కరోనా వైరస్‌ భారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన డాక్టర్‌ దంపతులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శంషాబాద్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే మరో స్టాఫ్‌ నర్సు కూడా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. (డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్)

స్వీయ నియంత్రణ పాటించక పోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మూలంగా పలు థర్డ్‌ కాంటాక్ట్‌ కేసులకు కారణమైంది. కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెడుతుంది. ఇంట్లోని వారు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతుండటం, వీరిలో ఇప్పటికే చాలా మంది విచ్చలవిడిగా బయట తిరగడం, బంధువులు, స్నేహితులు, ఇతరుల మధ్య గడపడంతో ఈ వైరస్‌ మరెంత మందికి విస్తరించి ఉంటుందనే విషయాన్ని క్లోజ్‌ కాంటాక్ట్‌ కేసులను పరిశీలిస్తున్న వైద్యులు కూడా అంతుబట్టడం లేదు. మార్కెట్లు, నిత్యవసరాలంటూ స్వీయ నియంత్రణ పాటించకుండా ఇలాగే విచ్చలవిడిగా తిరిగితే..భవిష్యత్తులో భారీ విపత్తులనే చవిచూడాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?)

డాక్టర్‌ దంపతుల నుంచి మరెంత మందికో..? 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన డాక్టర్‌ దంపతులు దోమలగూడలో ఉంటున్నారు. నిజానికి వీరు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో పని చేయడం లేదు. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స చేయకుండా, విదేశాలకు వెళ్లి వచ్చిన  నేపథ్యం కూడా లేకుండా వీరికెలా వైరస్‌ సోకిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆస్పత్రిలో వీరు ఎంత మందితో కలిసి పని చేశారు?  ఎంత మంది రోగులను పరీక్షించారు? ఏ ఏ రోగులు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? కుటుంబ సభ్యుల్లో ఎంత మంది వీరికి క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నారు..? వంటి ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఇప్పటి వరకు సమాధానం లేదు. (మీకు అర్థమవుతోందా?)

నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు 
నగరానికి నాలుగు వైపులా ఉన్న విజయవాడ, వరంగల్, బెంగళూరు, ముంబై జాతీయ రహదారులపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి కూడా ఇతరులెవరూ సిటిలోపలికి రాకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శివారుల్లోనే కాదు కోర్‌ సిటీల్లోనూ ఎక్కడిక్కడ దార్లను మూసివేశారు. శివార్లలోని పలు కాలనీల్లో రోడ్లకు అడ్డంగా పెద్దపెద్ద రాళ్లు, చెట్ల కొమ్మలు నరికి వేశారు. అయినప్పటికీ కొంత మంది యువకులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. కనీసం మాస్క్‌ కూడా ధరించడం లేదు. వైరస్‌పై అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు...ఉన్నత చదువులు చదు వుకున్న యువతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే....వైరస్‌ను ఎలా నియంత్రించగలమని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు.  (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?)

గాంధీ ఎమర్జెన్సీ కేసులు ఉస్మానియాకు షిఫ్ట్ః 
గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో కరోనా నోడల్‌ సెంటర్‌ ఉండటం, అనుమానిత లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, ఐసోలేషన్‌ వార్డులో 30కిపైగా పాజిటివ్‌ ఉన్నవారు చికిత్స పొందుతుండటం, అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉండ టంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వివిధ రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు సహా గుండె, కాలేయ, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం అత్యవసర విభాగాలకు చేరుకుంటున్న రోగులను ఇకపై ఉస్మానియాకు తరలించాలని నిర్ణయించింది. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement