‘విలీనం’పై జోక్యం చేసుకోండి  | Sakshi
Sakshi News home page

‘విలీనం’పై జోక్యం చేసుకోండి 

Published Tue, Apr 30 2019 12:09 AM

Congress merger of the TRS is unconstitutional - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని సోమవారం హైకోర్టు అభ్యర్థించారు. మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీ కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసే వ్యవ హారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 10వ షెడ్యూ ల్‌ ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్‌ పరిధిలోని అంశం కాదన్నారు. శాసనసభాపక్ష పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు.

అసలు తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ముందు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయా లంటూ తాము దాఖలు చేసిన ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెలువరిం చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేల రాజకీయ స్థాయిని నిర్ణయించే ముందు తమకు నోటీసులు జారీ చేసి, తమ వాదనలు వినేలా ట్రిబ్యునల్‌కు ఆదేశాలివ్వా లని కోరారు. ఈ విషయంలో తాము ఇప్పటికే కేవియట్‌ దాఖలు చేశామన్నారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ను విలీనం చేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధ మని పేర్కొన్నారు. శాసనమండలిలో కూడా ఇలాగే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే బాధ్యతను ఈ ఫిరాయింపుదారులకే అధికార పార్టీ కట్టబెట్టినట్లు తెలిసిందన్నారు. జాతీయ పార్టీని ఓ ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయా లని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, విలీనానికి ఆగమేఘాలపై నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తున్నారని వివరించారు. 

Advertisement
Advertisement