టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకులు | congress leaders joined in trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకులు

May 22 2014 12:07 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

 పటాన్‌చెరు, న్యూస్‌లైన్:  రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రామచంద్రాపురంలో బలమైన నేతగా, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అనుచరుడిగా ఆయన చాలా కాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో తెలంగాణవాదులంతా చేరవచ్చని పేర్కొన్నారు. ఒక్క టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.

తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు స్వార్థపరుల కారణంగా పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగయ్య, మాజీ వార్డు సభ్యుడు డోకూరి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నేత తణుకు శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇంకా టీఆర్‌ఎస్ నేత యాదగిరి యాదవ్, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement