నాలుగు  సరి

Congress Flop Show In Telangana Municipal Elections 2020 - Sakshi

కాంగ్రెస్‌కు దక్కింది తుర్కయాంజాల్, మణికొండ, చండూరు, వడ్డేపల్లి మాత్రమే

‘చే’జారిన పెద్దఅంబర్‌పేట్, ఆదిభట్ల, నారాయణ్‌ఖేడ్‌... నేరేడుచర్లపై ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 4 పురపీఠాలే దక్కాయి. వాస్తవానికి ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌గిరీలను దక్కించుకునే స్థాయిలో స్థానాలను గెలుచుకున్నప్పటికీ అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహం, బలం ముందు కాంగ్రెస్‌ చేతులెత్తేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్, మణికొండతో పాటు నల్లగొండ జిల్లా చండూరు, గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి రావా ల్సిన పెద్ద అంబర్‌పేట, ఆదిభట్ల, నారాయణ్‌ఖేడ్‌ను టీఆర్‌ఎస్‌ తన్నుకుపోయింది. ఇక సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సీపీఎంతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్‌కు మేజిక్‌ ఫిగర్‌ దక్కింది. కానీ, అక్కడ ఎక్స్‌అఫీషియో ఓట్ల సహకారంతో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేందుకు వ్యూహం పన్నుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ సాంకేతికంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో ఆ పార్టీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. 

కరీంనగర్‌లో తెరవని ఖాతా..
కాగా, సోమవారం వెలువడిన కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. అక్కడ మొత్తం 60 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేక డీలా పడింది. మిగిలిన కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో గెలుపొందడం తెలిసిందే.

కాంగ్రెస్‌ గెలిచిన స్థానాలివే...
మున్సిపాలిటీ                చైర్‌పర్సన్‌ పేరు                సామాజిక వర్గం
చండూరు                    తోకల చంద్రకళ                    ముదిరాజ్‌
తుర్కయాంజాల్‌           మల్‌రెడ్డి అనూరాధ                  రెడ్డి
మణికొండ                   నరేందర్‌                           ముదిరాజ్‌
వడ్డేపల్లి                      రాచపూడి కరుణ                   మాదిగ
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top