‘తాగునీటి’ సరఫరాలో వినియోగమెంత? | Committee on calculation of water consumption | Sakshi
Sakshi News home page

‘తాగునీటి’ సరఫరాలో వినియోగమెంత?

Dec 2 2017 4:09 AM | Updated on Nov 9 2018 5:56 PM

Committee on calculation of water consumption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో మరో కొత్త అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి తాగునీటికి వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకొని నీటి వినియోగాన్ని లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదన లేవనెత్తింది. కృష్ణా జలాల వినియోగంపై గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ వెలువరించిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొందని, గృహ అవసరాలకు వాడే నీటి వినియోగంలో 20 శాతాన్నే వినియోగం కింద లెక్కించాలని తెలిపిందన్న వాదన వినిపిస్తోంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

నిజానికి ప్రస్తుతం హైదరాబాద్‌ తాగునీటికి 15 టీఎంసీల మేర నీటిని కేటాయిస్తే, ఇందులో 4 నుంచి 6 టీఎంసీల మేర మాత్రమే వాస్తవ వినియోగముంటోంది. మిగతా నీరంతా డ్రైనేజీ రూపంలో తిరిగి మానేరు, మూసీ వంటి కృష్ణా ఉప నదుల్లోనే చేరుతోంది. దీంతో హైదరాబాద్, నల్లగొండ, మిషన్‌ భగీరథ కింద విడుదల చేసిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే తెలంగాణ నీటి వినియోగ ఖాతాలో వేయాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కృష్ణాబోర్డు శుక్రవారం బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ ఆనంద కుమార్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

లెక్కతేలని నీటి వినియోగంపైనా కమిటీ..
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేసిన నీటిలో 44 టీఎంసీల మేర లెక్కలోకి రాని నీటి అంశాన్ని తేల్చందుకు సైతం ఆనంద కుమార్‌ నేతృత్వంలో మరో కమిటీని బోర్డు ఏర్పాటు చేసింది. ఇప్పటికే లెక్కలో తేలకుండా ఉన్న 44 టీఎంసీల నీటిలో 20 టీఎంసీల నీటిని ఏపీ వినియోగం కింద లెక్కించాలని తెలంగాణ విన్నవించింది. శ్రీశైలం నుంచి విడుదల చేసినట్లు చూపిన నీటిలో 44 టీఎంసీలు ఎక్కడ వినియోగించారన్నది అయోమయంగా మారిందని, అయితే ఈ స్థాయిలో నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు మినహా మరే ఇతర మార్గం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement