విద్యాశాఖలో కలకలం | collector suspension on invigilators | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో కలకలం

Mar 31 2014 1:04 AM | Updated on Aug 17 2018 2:53 PM

పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు.

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. మొదటి రోజు 9, రెండో రోజూ ఐదుగురు, మూడో రోజూ 13 మంది డిబార్ అయ్యారు.

 ఈ మేరకు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ల వివరాలు, కేంద్రాలను డీఈవో వద్ద తీసుకుని 24 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. దీంతో మిగతా ఇన్విజిలేరట్లు, సీఎస్‌లు, డీవోలు భయాందోళనకు గురవుతున్నారు. వీరితోపాటు ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లుగా వ్యవహరించిన 18 మందిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీకి, ఐటీడీఏ పీవోకు, సాంఘీక సంక్షేమ శాఖ డీడీకి ఉత్తర్వులు పంపారు. వీరిపై కూడా సస్పెషన్ వేటు పడే అవకాశాలు లేకపోలేదు.

 జంకుతున్న ఉపాధ్యాయులు
 పదో తరగతి ఇన్విజిలేషన్ చేయడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో జోరుగా  మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని కొంత మంది సీఎస్, డీవోలు మామూళ్లకు ఆశపడి పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయిం గ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంతో ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి రెండు పరీక్షలకే 24 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో మిగతా పరీక్షల పరిస్థితి ఎలా ఉం టుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

 సస్పెండ్ చేయడం సరికాదు.. - రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
 జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారని ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోయేది. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బ తింటుంది. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం  ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు సస్పెన్షన్ విషయంలో మరోసారి ఆలోచించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement