కరోనా.. తగ్గుతోంది | CM KCR In Review Of Corona Eradication | Sakshi
Sakshi News home page

కరోనా.. తగ్గుతోంది

Apr 27 2020 2:00 AM | Updated on Apr 27 2020 7:53 AM

CM KCR In Review Of Corona Eradication - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

వైరస్‌ నిరోధానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాలు అందజేయాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మరణాలు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. చదవండి: వందేళ్ల క్రితం ఏం జరిగింది..? 

భవిష్యత్తు కార్యాచరణపై నేడు స్పష్టత..
లాక్‌డౌన్‌ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా> తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా ఈ కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’అని తెలిపారు. సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌ రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement