తప్పు మీది.. కాదు మీదే... | CGG, TSPSC on Group-1 posting errors | Sakshi
Sakshi News home page

తప్పు మీది.. కాదు మీదే...

Nov 1 2017 2:05 AM | Updated on Nov 1 2017 2:50 AM

CGG, TSPSC on Group-1 posting errors

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పోస్టుల భర్తీలో భాగంగా పోస్టింగుల్లో దొర్లిన పొరపాటు సర్కారుకు తలనొప్పిగా మారింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని పోస్టింగులను ఖరారు చేయాల్సి ఉండగా, అలా చేయకుండానే సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఇచ్చిన తప్పుడు డేటా వల్ల పోస్టింగులే మారిపోయాయి. దీంతో టాప్‌ ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్యం లేని పోస్టులు లభించడం గందరగోళంగా మారిం ది.

తమ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోలేదం టూ అభ్యర్థులు చేసిన ఫిర్యాదుతో మళ్లీ పరిశీలన జరపగా పోస్టింగుల్లో పొరపాటు దొర్లినట్లు టీఎస్‌పీఎస్సీ గుర్తించింది. అయితే తప్పు సీజీజీలోనే జరిగిందని టీఎస్‌పీఎస్సీ చెబుతుండగా.. సమాచారాన్ని సరి చూసుకో వాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీ అధికారులదే నని సీజీజీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాము  డేటా ప్రాసెసింగ్‌ ఏజెన్సీ మాత్రమేనని, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీ అధికారులదేనని చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ మంగళ వారం టీఎస్‌పీఎస్సీ, సీజీజీ అధికారులతో భేటీ అయి విచారణ జరిపినట్లు తెలిసింది.

అందరి ఆప్షన్లు పరిగణనలోకి తీసుకోలేదా?
మెరిట్, రోస్టర్, రిజర్వేషన్, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా పోస్టుల కేటాయింపునకు సంబంధించిన డేటా ప్రాసెస్‌ చేసే సమయంలో అందరి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనేది తేలాల్సి ఉందని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పేర్కొం టున్నారు. మొత్తానికి అప్షన్లను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగులు ఇచ్చినట్లు గుర్తిం చిన టీఎస్‌పీఎస్సీ వాటిని రద్దు చేసి, అభ్య ర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం తాజా కేటా యింపులపై దృష్టి సారించింది. బుధవారం తాజా పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది.


వరుస తప్పిదాల సీజీజీ
మొన్నటికి మొన్న డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా తప్పుడు కేటాయిం పులు జరిపి విద్యార్థులను సీజీజీ ఇబ్బం దుల్లో పడేసింది. తాజాగా గ్రూప్‌–1 పోస్టింగులకు సంబంధించిన డేటా ప్రాసెస్‌ విషయంలోనూ పొరపాట్లు దొర్లడంతో పోస్టింగులు మారి పోవడం చర్చనీయాం శమైంది.

గతంలో సీజీజీ పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం ఎన్నిసార్లు స్పష్టం చేసినా తీరు మారకపోవడం సమస్యలకు కారణమవుతోంది. మరోవైపు డేటా ప్రాసెస్‌ కోసం తమకు ప్రత్యేక అవకాశం కల్పించాలని, డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వాన్ని గతంలో కోరింది. తాజా సమస్యల నేపథ్యంలో డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement