563 పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
కమిషన్ మూల్యాంకన విధానం సరైనదేనని స్పష్టికరణ
టీజీపీఎస్సీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన 563 గ్రూప్–1 పోస్టుల నియామకాలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఈ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్–1 నియామకాలకు ఆమోదం తెలుపుతూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తుది తీర్పును వెలువరించింది.
గ్రూప్–1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పి. ఆదిత్య తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. నియామక ప్రక్రియలో కమిషన్ అనుసరించిన విధానాలను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియామకాలను సమరి్థంచిందని.. ఆ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టేసింది.
పారదర్శకంగా ’ట్రిపుల్ ఎవాల్యుయేషన్’
విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియలో కమిషన్ అత్యంత పారదర్శకత పాటించిందని కోర్టుకు వివరించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అత్యంత శాస్త్రీయమైన ‘ట్రిపుల్ ఎవాల్యుయేషన్’(మూడంచెల మూల్యాంకనం) విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు.
మూల్యాంకనకర్తలు మా ర్కులు వేసేటప్పుడు ఉండే వ్యత్యాసాలను (కొందరు కఠినంగా, మరికొందరు ఉదారంగా వేయడం) తగ్గించి, అభ్యర్థులకు న్యా యం చేసేందుకే ఈ పద్ధతిని అమలు చేశామన్నారు. మొదటి రెండు విడతల్లో బార్కోడ్విధానం పాటించామని.. మూడో విడ తలో మూల్యాంకనకర్తకు అభ్యర్థి వివరాలు తెలియకుండా ఉండేందుకు, గోప్యతను కాపాడేందుకు మాత్రమే బార్కోడ్ వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వెబ్నోట్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.
నిలబడని పిటిషనర్ల వాదనలు
మూడో విడత మూల్యాంకనంలో బార్కోడింగ్ లేకపోవడం వల్లే అక్రమాలకు ఆస్కా రం ఏర్పడిందని.. సుమారు 924 మంది అభ్యర్థుల ఎంపికలో వ్యత్యాసాలు ఉన్నాయ ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. జవాబుల ‘కీ’లోనూ లోపాలు ఉన్నా యని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల సందర్భంగా మూల్యాంకన విధానం, బార్కోడింగ్ మినహాయింపు తదితర సాంకేతిక అంశాలపై కమిషన్ను ప్రశ్నించిన ధర్మాసనం.. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయ స్థానం.. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకున్న అనంతరం పిటిషన్లను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.


