breaking news
cgg
-
యథావిధిగా టీఆర్టీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లు యథావిధిగా జరుగుతాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని చెప్పారు. ఈ నెల 24 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా ప్రాసెస్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిబ్బంది(సీజీజీ) చేసిన పొరపాట్ల వల్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో తప్పులు దొర్లాయని, వాటిని మార్చామని చెప్పారు. రాత పరీక్షలకు (ఆఫ్లైన్) సంబంధించి పరీక్ష కేంద్రాల ను ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలోనే కేటాయించామని, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్) పోస్టులకు ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఎక్కడైనా కేటాయించే అధికారం టీఎస్పీఎస్సీకి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం గా పేర్కొన్నా.. అభ్యర్థులకు అసౌకర్యం కలగకూడదని మార్పులు చేసినట్లు చెప్పారు. 25 నాటి పరీక్షల హాల్టికెట్లు నేడు.. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలకు హెచ్ఎండీఏ సహా కరీంనగర్, వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చక్రపాణి తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్ అభ్యర్థులకు హైదరాబాద్ తదితర జిల్లాల్లో కేటాయించామని చెప్పారు. కరీంనగర్లో ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కొందరికి ఇతర జిల్లాల్లో కేంద్రాలు కేటాయించామన్నారు. 48 రకాల సబ్జెక్టులు, మీడియం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. 24న జరిగే పరీక్షల హాల్టికెట్ల జారీని బుధవారం ప్రారంభించామని, 25 నాటి పరీక్షలకు హాల్టికెట్లు గురువారం అందుబాటులో ఉంచుతామని, ఇలా మార్చి 4వ తేదీ వరకు జరిగే పరీక్షల హాల్టికెట్లను వరుసగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్టీ తర్వాత ‘గురుకుల లెక్చరర్’ గురుకుల టీజీటీ పోస్టుల పరీక్ష ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని చక్రపాణి వెల్లడించారు. పీజీటీ పోస్టులు పొందిన వారు కొందరు టీజీటీ పోస్టుల ఎంపిక జాబితాలోనూ ఉన్నారని, అందులో టీజీటీ పోస్టు వద్దనుకునే వారి అభిప్రాయాలు తీసుకొని తరువాతి మెరిట్ అభ్యర్థుల ఎంపిక చేపట్టామన్నారు. నెల రోజుల్లో పోస్టింగులు ఇస్తామని చెప్పారు. గురుకుల లెక్చరర్ పోస్టుల మెయిన్ పరీక్షలకు 1:15 రేషియోలో సీజీజీ ఎంపిక చేసిన జాబితాలో పొరపాట్లు దొర్లినందున ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామన్నారు. టీఆర్టీ పరీక్షలు పూర్తయ్యాక వాటికి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు టీఎస్పీఎస్సీ, పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ హెచ్చరించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారం కమిషన్కు ఉందని చెప్పారు. గతంలో నిజామాబాద్లోని ఓ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయకపోయినా అక్కడ పరీక్ష కేంద్రం ఉందని, అక్కడ పరీక్ష రాసిన 150 మందిని ఎంపిక చేశారని తప్పుడు ప్రచారం చేశారని, అలా ప్రచారం చేసిందెవరో గుర్తించామని వివరించారు. టీఎస్పీఎస్సీని అభాసుపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. హెల్ప్డెస్క్ను సంప్రదించండి హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే స్వయంగా లేదా ఫోన్ ద్వారా టీఆర్టీ హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు హెల్ప్డెస్క్ పని చేస్తుందని చెప్పారు. రెండు రకాల సబ్జెక్టులు మినహా మిగతా 46 రకాల సబ్జెక్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున మాక్ టెస్టు లింకును వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ప్రశ్నకు సరైన జవాబు ఎంపిక చేసుకొని టిక్ చేశాక జవాబు పక్కన ఉండే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని, అప్పుడే జవాబు రాసినట్లు ధ్రువీకరణ అవుతుందని వివరించారు. టీఆర్టీ పీఈటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్లోనూ ఇవ్వండి టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ల్లో పీఈటీ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు తెలుగుతో పాటు ఇంగ్లిష్లోనూ ప్రశ్నపత్రం ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. పీఈటీ కోర్సు ఇంగ్లిష్లోనే ఉంటుందని, తెలుగులోనే ప్రశ్నపత్రం ఇస్తే అభ్యర్థులు నష్టపోతారంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కె.వెంకటరమణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో రెండు భాషల్లోనూ పరీక్షను నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రమేశ్ హైకోర్టుకు తెలపటంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలిచ్చారు. -
తప్పు మీది.. కాదు మీదే...
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల భర్తీలో భాగంగా పోస్టింగుల్లో దొర్లిన పొరపాటు సర్కారుకు తలనొప్పిగా మారింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని పోస్టింగులను ఖరారు చేయాల్సి ఉండగా, అలా చేయకుండానే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన తప్పుడు డేటా వల్ల పోస్టింగులే మారిపోయాయి. దీంతో టాప్ ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్యం లేని పోస్టులు లభించడం గందరగోళంగా మారిం ది. తమ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోలేదం టూ అభ్యర్థులు చేసిన ఫిర్యాదుతో మళ్లీ పరిశీలన జరపగా పోస్టింగుల్లో పొరపాటు దొర్లినట్లు టీఎస్పీఎస్సీ గుర్తించింది. అయితే తప్పు సీజీజీలోనే జరిగిందని టీఎస్పీఎస్సీ చెబుతుండగా.. సమాచారాన్ని సరి చూసుకో వాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ అధికారులదే నని సీజీజీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము డేటా ప్రాసెసింగ్ ఏజెన్సీ మాత్రమేనని, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ అధికారులదేనని చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ మంగళ వారం టీఎస్పీఎస్సీ, సీజీజీ అధికారులతో భేటీ అయి విచారణ జరిపినట్లు తెలిసింది. అందరి ఆప్షన్లు పరిగణనలోకి తీసుకోలేదా? మెరిట్, రోస్టర్, రిజర్వేషన్, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా పోస్టుల కేటాయింపునకు సంబంధించిన డేటా ప్రాసెస్ చేసే సమయంలో అందరి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనేది తేలాల్సి ఉందని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పేర్కొం టున్నారు. మొత్తానికి అప్షన్లను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగులు ఇచ్చినట్లు గుర్తిం చిన టీఎస్పీఎస్సీ వాటిని రద్దు చేసి, అభ్య ర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం తాజా కేటా యింపులపై దృష్టి సారించింది. బుధవారం తాజా పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. వరుస తప్పిదాల సీజీజీ మొన్నటికి మొన్న డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా తప్పుడు కేటాయిం పులు జరిపి విద్యార్థులను సీజీజీ ఇబ్బం దుల్లో పడేసింది. తాజాగా గ్రూప్–1 పోస్టింగులకు సంబంధించిన డేటా ప్రాసెస్ విషయంలోనూ పొరపాట్లు దొర్లడంతో పోస్టింగులు మారి పోవడం చర్చనీయాం శమైంది. గతంలో సీజీజీ పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం ఎన్నిసార్లు స్పష్టం చేసినా తీరు మారకపోవడం సమస్యలకు కారణమవుతోంది. మరోవైపు డేటా ప్రాసెస్ కోసం తమకు ప్రత్యేక అవకాశం కల్పించాలని, డేటా ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుంటామని టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని గతంలో కోరింది. తాజా సమస్యల నేపథ్యంలో డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది. -
సీజీజీ డీజీగా రాజేంద్ర నిమ్జే
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డెరైక్టర్ జనరల్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజేంద్ర నరేంద్ర నిమ్జేను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకం చేపట్టారు. ఆయనకు నెలకు రూ.రెండున్నర లక్షల జీతాన్ని అందజేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకు సీజీజీ డీజీగా పూర్తి అదనపు బాధ్యత లను నిర్వహించిన కె.రామకృష్ణారావును రిలీవ్ చేశారు. బుధవారం ఈ మేరకు జీఏడీ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఉత్తర్వులిచ్చారు.