
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కంది రైతులకు శుభవార్త అందించింది. ఈ ఖరీఫ్లో పండించిన లక్ష మెట్రిక్ టన్నుల కందులను అదనంగా ధరల స్థిరీకరణ నిధి కింద కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. కందుల ధరల స్థిరీకరణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఆ లేఖలో అభినందించారు. అలాగే నిల్వల (బఫర్స్టాక్)ను ప్రజాపంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్లాంటి పథకాల కింద పౌష్టికాహారం అందజేసేందుకు రాష్ట్రంలో వినియోగించాలని పాశ్వాన్ సూచించారు.