మా వాదనలూ వినండి! | brijesh Spicy implid petition to the Supreme Tribunal | Sakshi
Sakshi News home page

మా వాదనలూ వినండి!

Aug 28 2014 1:21 AM | Updated on Aug 29 2018 9:29 PM

కృష్ణా జలాల పంపిణీపై గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జరుగుతున్న విచారణలో తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

{బిజేష్ ట్రిబ్యునల్‌పై సుప్రీంలో తెలంగాణ ఇంప్లీడ్ పిటిషన్
{sిబ్యునల్ తీర్పుపై రేపు విచారణ.. ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం

 
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జరుగుతున్న విచారణలో తమ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు బుధవారం ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం నీటి కేటాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరింది. కాగా ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. ఇదే సమయంలో ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కృష్ణానది జలాల కేటాయింపుపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమిం చింది. నీటి లభ్యత, కేటాయింపులు, వినియో గం విషయాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రస్తుత ట్రిబ్యునల్ పరిధిని విస్తరించాలని, లేదంటే కొత్త ట్రిబ్యునల్ వేయాలని సుప్రీంను కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మళ్లీ పంపిణీ చేయాలి..

తెలంగాణ వాదన వినకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అవార్డును అమలు చేస్తే తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ వాదనగా ఉంది. దీంతోపాటు ట్రిబ్యునల్ ఇప్పటివరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపలేదన్న అంశాన్ని కోర్టు దృష్టికి తేనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జల వివాదాలకు ఉద్దేశించిన బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో నాలుగు రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుని నీటిని కేటాయించాలని ఇప్పటికే కోరిన అంశాన్ని కోర్టు దృష్టికి తేవాలని నిర్ణయిం చింది. ఈ కేసు విషయమై ప్రభు త్వ సలహా దారు విద్యాసాగర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బుధవారమే ఈ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి తమ వాదనలకు అవకాశమివ్వాలని కోరాం. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, ట్రిబ్యునల్ పరిధి పెంపుపై ప్రస్తావన చేయలేదు.’’ అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement