మా అధికార పరిధిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు
మళ్లీ దానినే ఏపీపై ప్రయోగించమంటే ఎలా?
తెలంగాణ వైఖరిపై కృష్ణాబోర్డు తీవ్ర ఆక్షేపణ
ఏపీ జలవిద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ఫిర్యాదుపై చర్యలకు విముఖత
త్రిసభ్య కమిటీకే నివేదించుకోవాలని
ఇరు రాష్ట్రాలకు సూచన
ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీలకు ఘాటుగా కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు సుప్రీంకోర్టులో బోర్డు అధికారిని ప్రశ్నిస్తూనే, మరోవైపు అదే అధికార పరిధిని ఏపీకి వ్యతిరేకంగా ప్రయోగించాలని తెలంగాణ కోరడం చట్టవిరుద్ధమని కృష్ణానది యాజమాన్య బోర్డు (కృష్ణా బోర్డు) ఆక్షేపణ తెలిపింది. ఒకేసారి అనుకూల, ప్రతికూల వాదనలు చేయకూడదనే న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని బోర్డు స్పష్టం చేసింది. కృష్ణాబోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2కి కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు రెఫరెన్స్ను ఏపీ సైతం సుప్రీంకోర్టులో సవాలు చేసిందని ప్రస్తావించింది. శ్రీశైలం జలాశయంలో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ రాష్ట్రం ఖాళీ చేస్తోందని తెలంగాణ చేసిన ఫిర్యాదుపై చర్యలకు బోర్డు విముఖత చూపుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు మంగళవారం లేఖ రాసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీ, ప్రాజెక్టుల ఆపరేషన్స్ ప్రొటోకాల్స్పై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకోవడంతోపాటు బోర్డు అధికార పరిధి కింద ప్రాజెక్టులను తీసుకొచ్చే వరకు బోర్డు కార్యకలాపాలపై చట్టపర పరిమితులుంటాయని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది.
త్రిసభ్య కమిటీకే చెప్పుకోండి
శ్రీశైలం ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిన అనుమతులు, రిజర్వాయర్ నిర్వహణ నియమావళి (రూల్ కర్వ్) తమ వద్ద లేదని కృషా ్ణబోర్డు తెలిపింది. ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటి విస్తరణ, సామర్థ్యంలో మార్పులు వచి్చన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సైతం స్పష్టత లేదని పేర్కొంది. గత జనవరి 30న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధులకు ఈ విషయాలను తెలియజేశామని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 తుది తీర్పు వచ్చే వరకు, పైన పేర్కొన్న అంశాలు తేలే వరకు రెండు రాష్ట్రాల తమ సమస్యలను త్రిసభ్య కమిటీకే నివేదించుకోవాలని బోర్డు సూచించింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి నేతృత్వంలో ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై చర్చించి తాత్కాలిక వాటాలను ఖరారు చేస్తుంది.


