ప్రజల కోసమే పోలీసులు పనిచేయాలి:భట్టి

Bhatti Vikramarka Fires On TRS Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బోయినిపల్లి సంఘటనపై పోలీసుల తీరును తప్పుబట్టారు. ‘బోయినిపల్లిలో ఒక స్థల వివాదంలో స్థానిక అధికార పార్టీ నేత రాజకీయ పలుకుబడి అడ్డం పెట్టుకుని తన అనుచరులు, గుండాలతో కలిసి భూమిలో ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేయడమే కాకుండా వాచ్‌మేన్‌ శంకరప్ప పైన పెట్రోలు పోసి నిప్పంటిచారు. శంకరప్ప భార్యను వివస్త్రను చేసి హింసించారు. ఈ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని’ భట్టి విక్రమార్క విమర్శించారు.

వాచ్‌మేన్‌ పరిస్థితి విషమంగా ఉందని..మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. శంకరప్ప భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల కోసం కాకుండా.. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని భట్టి విక్రమార్క హితవు పలికారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top