కేంద్రం అమలు చేయాలనుకుంటున్న రోడ్సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వివిధ ఆటో యూనియన్ నాయకులు వెల్లడించారు.
హైదరాబాద్: కేంద్రం అమలు చేయాలనుకుంటున్న రోడ్సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వివిధ ఆటో యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తీర్మానించారు.
ఇప్పటికే ఆర్థికంగా వెనకబడ్డ ఆటో డ్రైవర్లు కొత్త చట్టం అమలుతో మరింత కష్టాలపాలవుతారని నాయకులు అన్నారు. సిగ్నల్ జంప్ చేస్తే 5వేలు, నోపార్కింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రై వింగ్ చేస్తే 5వేలు, బీమా సమస్య ఉంటే 20వేలు, వాహనం కండిషన్ లేకుంటే 10 వేలు, ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగితే 4 లక్షల జరిమానా, జైలు శిక్ష వంటి నిబంధనలు బిల్లులో ఉన్నాయని, ఆ నిబంధనలను వెంటనే తొలిగించాలని డిమాండ్ చేశారు.
రహదారి భద్రత బిల్లుతో ఎదురయ్యే అనర్థాలపై ఈనెల 19న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని ఆటో యూనియన్ల జేఏసీలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బి. వెంకటేశం (ఏఐటీయూసీ), హబీబ్ (బీఎంఎస్), ఈశ్వరరావు (సీఐటీయూ), కిరణ్ (ఐఎఫ్టీయూ), ఎ. నరేందర్ (ఐఎఫ్టీయూ), సత్తిరెడ్డి (టీసీఏడీయూ), రవి (టీఆర్ఏటీటీయూ) తదితరులు పాల్గొన్నారు.