‘ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉంది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్, ఇతర జాతీయ నేతలు బుధవారం మద్దతు తెలిపారు. అనంతరం కేకే దివాకరన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని అన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంద్తో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు తెలిపాయని అన్నారు. 12వ కోజు సమ్మె ఉధృతంగా సాగుతోందని, సమ్మెలో పాల్గొంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వేసే వలలో ఎవరు పడవద్దని ఆశ్వత్థామరెడ్డి కోరారు.