ఏసీబీ వలలో వీఆర్వో | ACB trap VRO | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్వో

Aug 8 2014 4:54 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ విసిరిన వలకు ఓదెల మండలం గుండ్లపల్లి వీఆర్వో పంగ రమేశ్ చిక్కాడు. గురువారం ఓ రైతు నుంచి గ్రామంలోని బస్టాండ్ కూడలిలో రూ.మూడు వేలు తీసుకుంటుండగా..

 ఓదెల : ఏసీబీ విసిరిన వలకు ఓదెల మండలం గుండ్లపల్లి వీఆర్వో పంగ రమేశ్ చిక్కాడు. గురువారం ఓ రైతు నుంచి గ్రామంలోని బస్టాండ్ కూడలిలో రూ.మూడు వేలు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తహశీల్దార్ కార్యాలయం లో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డికి అదే గ్రామంలో 1269/బీ సర్వేనంబర్‌లో 1.25 ఎకరాలు, 1292/ఏ 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
 
 ఈ సర్వేనంబర్లలోని భూమి మొత్తం అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మల్లారెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డికి చెందిన సర్వేనంబర్ 56లో నమోదైంది. బాధితుడు కుమార్‌రెడ్డి పహాణి కోసం మీసేవకు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పహాణిలో పేరు నమోదు చేయాలంటూ 2013 సెప్టెంబర్ 6న అప్పటి తహశీ ల్దార్ పద్మావతికి దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన ఆమె.. వీఆర్వో రమేశ్‌ను ఆదేశించారు. దీనికి రమేశ్ లంచం డిమాండ్ చేశా డు. ఇద్దరి మధ్య రూ.15వేలకు ఒప్పందం కుది రింది. మొదటి విడతగా కుమార్‌రెడ్డి ఆర్నెల్ల క్రితం రూ.ఐదు వేలు ముట్టజెప్పాడు. స్పందిం చకపోవడంతో రెండు నెలల క్రితం మరో రూ.రెండు వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులి స్తేనే.. అనడంతో ఏసీబీని ఆశ్రయించాడు.
 
 వలపన్ని పట్టుకున్న ఏసీబీ..
 పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రూ.మూడువేలను కుమార్‌రెడ్డితో పంపించారు. బాధితు డు ఫోన్ చేయగా.. తాను బస్టాండ్ కూడలిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కుమార్‌రెడ్డి అక్కడకు వెళ్లి ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.మూడు వేలను అందించాడు. వాటిని జేబులో పెట్టుకుంటుండగానే.. అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఆయన వెంట సీఐలు రమణారెడ్డి, సతీష్‌చందర్, శ్రీనివాసరాజు, విజయభాస్కర్‌రెడ్డి ఉన్నారు.
 వేధిస్తే ఫిర్యాదు చేయండి..
 - సుదర్శన్‌గౌడ్, డీఎస్పీ ఏసీబీ
 
 జిల్లాలో రెవెన్యూ శాఖ ఉద్యోగులపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. లంచం కోసం వేధిస్తే ఎంత పెద్ద వారైనా సరే ఫిర్యాదు చేయండి. అవినీతిపరులను పట్టుకుంటాం. ఎంతపెద్ద వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
 ఏసీబీ ఫోన్ నంబర్.. 9440446150
 
 ప్రాధేయపడినా వినలేదు
 తండ్రుల పేర్లు.. మా పేర్లు ఒకేలా ఉన్నాయి. పాస్‌బుక్‌లో (1006)లో నాపేరిట భూమి ఉన్నా.. పహాణిలో లేదు. దానిని మీ సేవలో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్న. ఆమె వీఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదు. పైగా రూ.20వేలు లంచం కావాలన్నడు. చేసేది లేక రూ.15వేలు ఒప్పుకున్న. ఆర్నెల్ల క్రితం రూ.ఐదు వేలు, రెండు నెలల క్రితం మరో రూ.రెండు వేలు ఇచ్చిన. డబ్బులు లేవు.. మీరే ఎలాగైనా దయ చూపండని వేడుకున్న. అయినా వీఆర్వో వినలేదు. అందుకే ఏసీబీకి పట్టిచ్చిన.      
 - కుమార్‌రెడ్డి, బాధితుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement