ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

2 Inter State Thieves Arrested In Nizamabad District - Sakshi

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో 15 రోజుల కింద అర్ధరాత్రి  వినాయక్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీలో మూడు బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు సీపీ కార్తికేయ బుధవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించామన్నారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన దీపక్‌సింగ్‌ గ్యాంగ్‌ నిజామాబాద్‌ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిందన్నారు. వినాయక్‌నగర్‌లో మూడు బంగారు దుకాణాల్లో మొత్తం ఐదుగురు చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా వీరు టాటా సుమోలో వచ్చి, దోపిడీ చేసి పారిపోయిన దృశ్యాలను పరిశీలించామన్నారు. నవీపేటలో సీసీ పుటేజీని పరిశీలించగా దీన్ని గుర్తించామన్నారు. దీపక్‌సింగ్‌పై నిఘా పెట్టి విచారణ చేపట్టగా ఇదే గ్యాంగ్‌ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.

గతంలో ఆర్మూర్‌లో వరుసగా షెట్టర్‌ చోరీలు, ఇటీవల బోధన్‌లో చోరీ, నిజామాబాద్‌లో మూడు బంగారు దుకాణాల్లో చోరీ ఇదే గ్యాంగ్‌ చేసిందన్నారు. నాందేడ్‌ జిల్లాకు చెందిన షేక్‌సద్దామ్, దీపక్‌సింగ్‌ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారి నుంచి 4 కిలోల వెండి, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుండగులు వినియోగించిన బైక్‌లు, టాటా సుమోను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీపక్‌సింగ్‌ ముఠా నిజామాబాద్, మహారాష్ట్రలో వరుస చోరీలకు పాల్పడుతుందని అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. నగర సీఐ నరేష్, 4వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top