యూట్యూబ్‌లో చూసి..  చోరీలు చేసి!

15 vehicles robbery in 3 months - Sakshi

     పోలీసులకు పట్టుబడిన బాలుడు

     మరో ముగ్గురితో కలసి జట్టు

     3 నెలల్లో 15 వాహనాలు తస్కరణ

హైదరాబాద్‌: యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ బాలుడు పోలీసులకు పట్టుబడ్డాడు. మూడు నెలల్లో పదిహేను స్పోర్ట్స్‌ బైక్‌లను మాయం చేశాడు. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ చక్రవర్తి వివరాలను వెల్లడించారు. పహాడీ షరీఫ్‌ ప్రాంతంలో నివాసముండే అబ్దుల్‌ ఖాదర్‌ కుమారుడు(15) ద్విచక్ర వాహనాలను దొంగిలించే వీడియోలను ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో చూశాడు. తర్వాత కొద్ది రోజులకు స్నేహితుడి వాహనాన్నే దొంగిలించాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలబాట పట్టాడు.

స్థానికంగా ఉండే పాత నేరస్తుడు, ఎలక్ట్రీషియన్‌ మొహమ్మద్‌ సోహైల్‌(19), మరో ఇద్దరు స్నేహితులతో కలసి చోరీలకు పాల్పడుతు న్నాడు. ఈ దొంగలు కేవలం స్పోర్ట్స్‌ బైక్‌లు, బుల్లెట్లు, రాయల్‌ఎన్‌ఫీల్డ్, 200 సీసీ పైన ఉన్న పల్సర్‌ వాహనాలనే చోరీ చేసేవారు. కేవలం రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే తాళం విరగ్గొట్టి ఎంతటి వాహనాన్నైనా సునాయాసంగా తస్కరించేవారు. ఈ వాహనాలను విక్రయించిన సొమ్ముతో షికార్లు చేయడం, మండి బిర్యాని తినడం వంటివి చేసేవారు. 

దొరికింది ఇలా..... 
ఈ నెల 10న కాళీమందిర్‌ ప్రాంతానికి చెందిన అక్షయ్‌ తన కేటీఎం స్పోర్ట్స్‌ బైక్‌పై అత్తాపూర్‌లోని స్నేహితున్ని కలవడానికి వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మొఘల్‌నగర్‌ రింగ్‌ రోడ్‌ వద్దకు రాగానే వాహనంలో పెట్రోల్‌ అయిపోయింది. సమీపంలో ఉన్న క్లాసిక్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద బైక్‌ పార్కు చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే వచ్చి చూడగా వాహనం కనిపించకపోవడంతో లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం సాలార్‌జంగ్‌ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ దొంగలను కానిస్టేబుళ్లు మనీష్‌కుమార్‌ తివారి, నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ విషయాలు బయటపడ్డాయి. ముగ్గురు మైనర్‌ బాలురతోపాటు మొహమ్మద్‌ సోహైల్‌(19), మొహమ్మద్‌ గఫూర్‌ ఖాన్‌(20)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి 4 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లతోపాటు 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top