ఐటీ దాడులకు ఐదు రాష్ట్రాల అధికారులు | two days income tax officers meeting completed in chennai | Sakshi
Sakshi News home page

ఐటీ దాడులకు ఐదు రాష్ట్రాల అధికారులు

Dec 27 2016 3:39 AM | Updated on Sep 27 2018 4:24 PM

తమిళనాడు మాజీ సీఎస్‌ రామమోహన్‌రావు, కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి, ఇళ్లపై ఐటీ దాడులతో మరికొంత మంది బడా బాబుల పేర్లు బైటకు రాబోతున్నాయి.

చెన్నైలో ముగిసిన రెండురోజుల రహస్య సమావేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై:
తీగలాగితే డొంక కదిలినట్లుగా తమిళనాడు మాజీ సీఎస్‌ రామమోహన్‌రావు, కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి, ఇళ్లపై ఐటీ దాడులతో మరికొంత మంది బడా బాబుల పేర్లు బైటకు రాబోతున్నాయి. శేఖర్‌రెడ్డి, రామ మోహన్‌రావుల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో పేర్లు న్న పెద్దల ఇళ్లపై దాడులకు ముహూర్తం పెడుతున్నారు. తమిళనాడులో రెండో విడత దాడులకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25, 26వ తేదీల్లో చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయంలో అధికారులు రహస్యంగా సమావేశమ య్యారు. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 140 మంది ఐటీ ఉన్న తాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిసింది. నగదు, నగలు, డాక్యుమెంట్లే కాకుండా కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోవడానికి ప్రాముఖ్యతనివ్వా లని తీర్మానించారు.

బెంగళూరులో వివేక్‌కు కోట్ల స్థిరాస్తులు
తమిళనాడు మాజీ సీఎస్‌ రామమోహన్‌రావు కుమారుడు వివేక్‌ పాపిశెట్టికి గతవారంలో నోటీసులిచ్చిన ఐటీ శాఖ.. తాజాగా మరోసారి రిమైండర్‌ నోటీసులు పంపింది. తన భార్య అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేక పోతున్నానని గతంలో వివేక్‌ విచారణ అధికారులకు తెలి పాడు. వివేక్‌ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడి నట్లు ఐటీ శాఖ భావిస్తోంది. బెంగళూరులో కోట్లాది రూపాయల ఖరీదు చేసే 500 లగ్జరీ అపార్టుమెంట్లను వివేక్‌ కొనుగోలు చేసినట్లు దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా ఐటీ అధికారులు కనుగొన్నారు.

సహకార బ్యాంకులకు ఐటీ నోటీసులు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత కరెన్సీని మార్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి కొన్ని కోట్ల రూపాయల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో జిల్లా సహకార బ్యాంకులకు ఐటీశాఖ సోమవారం నోటీసులు జారీచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement