గిరిజన సంక్షేమ శాఖలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతుందన్నారు.
గిరిజన సంక్షేమ శాఖలో వివక్ష
Oct 22 2016 5:16 PM | Updated on Aug 18 2018 8:08 PM
అమరావతి : గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతున్నదని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ (సి) ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జగజ్యోతి, జి.చిట్టిబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు.
1984లో ఇంజనీరింగ్ విభాగం ప్రారంభమైన ప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు లేవన్నారు. అగ్రవర్ణాల వారికి వస్తున్నాయని, అర్హతలున్నా తమకు రావడం లేదని ఆరోపించారు. విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు ఎస్ఈలు, ఈఈలు, డీప్యూటీ ఈఈలు చక్రం తిప్పుతున్నారని, మంత్రిని సైతం పక్కదోవ పట్టించి కొందరు ఇన్ చార్జి ఈఈలుగా కొనసాగుతున్నారని అన్నారు.
ఇన్ చార్జి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీల్లో అర్హతలున్న వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా లేరన్నారు. దీనివల్ల కుల వివక్ష కొనసాగుతోందని వాపోయారు. సీతంపేట, కేఆర్ పురం ఇంజనీరింగ్ విభాగాల్లోని ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నా వారి స్థానంలో ఇన్చార్జిలు మాత్రమే కొనసాగుతున్నారని చెప్పారు. దళిత గిరిజన ఉద్యోగులకు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ నిరాకరణ ఉందన్నారు. విజ్ఞానం ద్వారా సమాజంలోని రుగ్మతలను అంబేద్కర్ ఎలా ఎదుర్కొన్నారో అదే బాటలో తాము నడుస్తున్నామని హెచ్చరించారు.
Advertisement
Advertisement