విద్యార్థి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం | They were sentenced to life term in student murder case | Sakshi
Sakshi News home page

విద్యార్థి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం

Nov 9 2014 2:38 AM | Updated on Nov 9 2018 4:36 PM

నగదు, నగల కోసం ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నలుగురికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యావజ్జీవ ....

బెంగళూరు:  నగదు, నగల కోసం ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నలుగురికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని  బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ శుక్రవారం చెప్పారు. పాట్నాకు చెందిన వారిక్, జార్ఖండ్‌కు చెందిన రోహిత్, బార్‌గర్ల్స్‌గా పని చేస్తున్న శివాని, ప్రీతి అనే నలుగురికి  ఈ శిక్షతో పాటు  ఒక్కొక్కరిని రూ. ఐదు వేలు జరిమాన విధించిందన్నారు.  అదే విధంగా హత్యకు గురై ఇంజనీరింగ్ విద్యార్థి తుషార్ (21) కుటుంబ సభ్యులకు రూ. 45 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. బీహార్‌కు చెందిన తుషార్ బెంగళూరు చేరుకుని ఇక్కడి ఎస్‌కేఐటీ కాలేజ్‌లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసేవాడు. వారిక్ ప్రయివేటు కంపెనీ ఉద్యోగి.

2011 జనవరిలో ఈ నలుగురు తుషార్‌ను కిడ్నాప్ చేశారు. తరువాత యలహంక సమీపంలోని అట్టూరు లేఔట్‌లోని వారిక్ ఇంటిలో నిర్బందించారు. చివరికి ఓడ్కా బాటిల్‌తో తుషార్ తల పగలగొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి విరసాగర రోడ్డులోని కెంపనహళ్ళి దగ్గర ఉన్న నీలగిరి తోటలో విసిరి వేసి అక్కడి నుంచి పరారైనారు. అప్పటి అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.ఎస్. అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో శిక్ష, జరిమాన విధించిందని అలోక్‌కుమార్ తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement