రెండోరోజూ కొనసాగిన బంద్ | The second day of the boycott continues in Bhiwandi textile industry | Sakshi
Sakshi News home page

రెండోరోజూ కొనసాగిన బంద్

Nov 8 2013 2:31 AM | Updated on Sep 2 2017 12:23 AM

కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు పాటిస్తున్న బంద్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగింది.

భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు పాటిస్తున్న బంద్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగింది. నిత్యం మరమగ్గాల చప్పుళ్లతో హడావుడిగా ఉండే పట్టణం బంద్ వల్ల ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే పరిశ్రమలు స్తంభించిపోవడంతో వాటిపై ఆధారపడి ఉన్న పాన్‌షాపులు, టీ కొట్లు తదితర చిన్న వ్యాపారాలూ దెబ్బతింటున్నాయి.  ప్రతినిత్యం పనిచేస్తేనే ఈ చిన్నవ్యాపారులు కుటుంబాలను పోషించుకోగలుగుతారు. మరోవైపు బంద్ ఈ నెల 15 వరకు కొనసాగనున్నందున.. చాలా మంది కార్మికులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. గత రెండు రోజుల నుంచి సుమారు 500 మందికిపైగా కార్మికులు స్వగ్రామాలకు వెళ్లారని పరిశ్రమల యజమానులు తెలిపారు.
 
 మగ్గాలు పున:ప్రారంభమైనా కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తి కష్టంగా మారుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భివండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో ప్రాంతాధికారి కార్యాలయం ఎదురుగా గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సురేష్ టావురే మాట్లాడుతూ...బంద్ పాటిస్తూనే మరోవైపు రాస్తారోకో, ధర్నా, ఆందోళన, మోర్చాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సురేష్ డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement