శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా చెన్నైలో జరిగిన ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన యువకుడు బుధవారం
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
5లక్షలు ప్రకటించిన నేతలు
సాక్షి, చెన్నై: శేషాచలం ఎన్కౌంటర్కు నిరసనగా చెన్నైలో జరిగిన ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన యువకుడు బుధవారం కీల్పాకం ఆసుపత్రిలో మృతిచెందాడు. అతడి మృతదేహానికి నివాళులర్పించిన నేతలు బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్కు నిరసగా, సీబీఐ విచారణకు పట్టుబడుతూ తమిళాభిమాన సంఘాలు, పార్టీల నేతృత్వంలో మంగళవారం సాయంత్రం చెన్నైలో చలో రాజ్భవన్ నినాదంతో ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. గిండి వేదికగా జరిగిన ఈ ర్యాలీ కోసం తిరుచెందూరు నుంచి తమిళర్ వాల్వురిమై కట్చికి చెందిన కార్యకర్త వినోద్ చెన్నైకు వచ్చాడు.
ఆ పార్టీ వర్గాలతో కలసి గిండి రైల్వే స్టేషన్ మీదుగా జెండాల్ని చేత బట్టి ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి అతడు పరుగులు తీశాడు. అయితే, అతడి చేతిలో ఉన్న జెండాకు ఇనుప రాడ్డు ఉండడం విషాదానికి దారితీసింది. రైల్వే ట్రాక్ వైపుగా పరుగులు తీస్తున్న అతడు జెండాను పైకి లేపడంతో 25కేవి విద్యుత్ తీగలు తగలడంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీన్ని గుర్తించిన సహచరులు అతన్ని కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. నిరసన అనంతరం సమాచారం అందుకున్న నాయకులు అతడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం వినోద్ మరణించాడు.
నేతల నివాళి : వినోద్ మరణ సమాచారంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, ఎంఎంకే నేత జవహర్లుల్లా తదితరులు పెద్ద సంఖ్యలో కీల్పాకం ఆసుపత్రి వద్దకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం వినోద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘన నివాళులర్పించారు. అతడి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తిరుచెందూరుకు తరలించారు. వినోద్ మరణ సమాచారంతో అతడి కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. తన కార్యకర్త మరణించడంతో తీవ్ర ఆవేదనకు లోనైన వేల్ మురుగన్, అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు *ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.