మా మంచి ఎమ్మెల్యే
అభినందిస్తున్న డాబుగాం నియోజక వర్గ ప్రజలు
క్షతగాత్రులను స్వయంగా హాస్పిటల్ చేర్చిన ప్రజాప్రతినిధి
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తన వాహనంలో హాస్పిటల్కు తీసుకువెళ్లి వారికి దగ్గరుండి చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజక వర్గ ప్రజలు ఎంఎల్ఏ మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితి సామల గ్రామం సమీపంలో మోటార్ బైక్పై వస్తున్న ఇద్దరు యువకులు బైక్ అదుపు తప్పడంతో ప్రమాదానికి గురై రోడ్డు మీద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు.
వారిద్దరూ రోడ్డుపై గాయాలతో పడి ఉన్న సమయంలో అటువైపుగా వెళ్తున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి చూసి వెంటనే తన కారు ఆపి విషయం తెలుసుకుని తన కారులో వారిద్దరినీ హాస్పిటల్కుతీసుకు వెళ్లి చేర్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని బాకటిగుడ గ్రామానికి చెందిన జోగేష్ బిశాయి, బెలాపుట్ గ్రామానికి చెందిన చంద్ర బిశాయిలుగా గుర్తించారు. వారిని ఎంఎల్ఏ తన సొంత వాహనంలో కొడింగ కమ్యూనిటీ హాస్పిటల్కు తీసుకువెళ్లి దగ్గరుండి చికిత్స చేయించారు. ఎంఎల్ఏ రొంధారి మానవత్వంతో క్షతగాత్రులను హాస్పిటల్కు తీసుకువెళ్లడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.