గ్రామీణ బ్యాంక్‌లో భారీ దోపిడీ | Massive exploitation of the rural banks | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంక్‌లో భారీ దోపిడీ

Jan 27 2015 2:02 AM | Updated on Sep 27 2018 8:27 PM

నిత్యం జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంలో దుండగులు బ్యాంక్ గోడకు కన్నం వేసి రూ. 14 లక్షల నగదు, రూ.6 ....

రూ.14 లక్షల నగదు
రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు
హాసన్ జిల్లాలో సంఘటన


బెంగళూరు(బనశంకరి) :   నిత్యం జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంలో దుండగులు బ్యాంక్ గోడకు కన్నం వేసి రూ. 14 లక్షల నగదు, రూ.6 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకాలోని హిరిసావలోని కావేరిగ్రామీణ బ్యాంక్‌లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.... కావేరి గ్రామీణ బ్యాంక్‌లో శనివారం బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించిన తరువాత బ్యాంక్‌కు అధికారులు తాళం వేశారు. ఆదివారం సెలవు రోజు కావడం కావడంతో అక్కడికి ఎవరూ వెళ్లలేదు. సోమవారం గణతంత్ర దినోత్సవం కావ డంతో బ్యాంక్ అధికారులు గణతంత్ర దినోత్సవం నిర్వహించడానికి బ్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భంలో గోడకు కన్నం వేసి ఉండటాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది తక్షణమే బ్యాంక్ ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు.

పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో, వేలిముద్రల నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంక్ వెనుక వైపున గోడకు కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు లాకర్‌లో ఉన్న రూ.14 లక్షలు నగదు, రూ.6 కోట్లు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. దోపిడీకీ పాల్పడిన దుండగరులు ఎలాంటి ఆధారాలు లభించకుండా బ్యాంకులోని స్ట్రాంగ్‌రూమ్‌లో అమర్చిన వైర్లను కత్తరించి సీసీ టీవీలను ధ్వంసం చేయడమే కాక బ్యాంకులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్‌పీ రవి డీ.కణ్ణణ్ణనవర్ పరిశీలించారు. బ్యాంకు దోపిడీకీ పాల్పడిన దుండగులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హిరిసావపట్టణ పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement