3 నెలలుగా జీతాలు లేవు! | Kasturba Vidyalaya teachers, staff protest salaries | Sakshi
Sakshi News home page

3 నెలలుగా జీతాలు లేవు!

Oct 6 2016 1:11 PM | Updated on Sep 4 2017 4:25 PM

బడిబయట ఉన్న అనాథలను చేరదీసి అక్షరాస్యులను చేయాలనే లక్ష్యంతో నెలకొల్పిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) పరిస్థితి గందరగోళంగా మారుతోంది.

 కేజీబీవీలకు అందని మూడు నెలల వేతనాలు
 అయోమయంలో బోధన, బోధనేతర సిబ్బంది
 బిల్లుల భారంతో ఏజెన్సీ నిర్వాహకుల తిప్పలు
 
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : బడిబయట ఉన్న అనాథలను చేరదీసి అక్షరాస్యులను చేయాలనే లక్ష్యంతో నెలకొల్పిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)  పరిస్థితి గందరగోళంగా మారుతోంది. మౌలిక వసతుల లేమితోపాటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు అనేక ఇక్కట్ల పాలవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 51 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 200 మంది విద్యార్థినులను చేర్చుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం జిల్లాలో  10,200 మంది విద్యార్థినులు ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం 7,594 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా 510 మంది బోధన, 357 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ఓ ప్రత్యేక అధికారి, సీఆర్టీలు(8మంది), కంప్యూటర్ ఆపరేటరు, అకౌంటెంట్, స్వీపర్ కం స్కావెంజర్, ఏఎన్‌ఎం, వాచ్‌మెన్‌లు ఇద్దరు చొప్పున సరాసరి 17 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి జూన్ వరకే వేతనాలు అందారుు. అప్పటినుంచి వేతనాలు రాకపోవడంతో వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినుల భోజనం కోసం టెండర్ల ద్వారా బియ్యం, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లను అందించాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో నాసిరకం భోజనం పెడుతున్నారు. దీంతో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల్లో బతుకమ్మ, ఆ వెంటనే దసరా పండుగలు వస్తున్నాయని, అప్పటి వరకైనా తమకు వేతనాలు ఇప్పించాలని సిబ్బంది కోరుతున్నారు. అలాగే భోజన కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
 
పొంతన లేని ప్రకటనలు
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదు. కేజీబీవీల్లో మూడు నెలలుగా బోధన, బోధనేతర సిబ్బంది, సరుకుల టెండర్ల నిర్వాహకులకు బిల్లులు చెల్లించకపోవడం శోచనీయం. నిరుపేదలు చదివే పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సింది పోరుు నెలల తరబడి జాప్యం చేయడం సరికాదు. ధనిక రాష్ట్రమంటూ గొప్పులు చెప్పుకునే ప్రభుత్వం పేద పిల్లలు చదువుకునే విద్యాలయాలకు బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు. 
- బండారి శేఖర్, కేజీబీవీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement