ఆవడి సమీపం పట్టాభిరామంలో వరుడు అదృశ్యమవడంతో శుక్రవారం జరగవలసిన వివాహం ఆగిపోయింది.
తిరువొత్తియూరు: ఆవడి సమీపం పట్టాభిరామంలో వరుడు అదృశ్యమవడంతో శుక్రవారం జరగవలసిన వివాహం ఆగిపోయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆవడి, పట్టాభిరామంకు చెందిన ఢిల్లీ. ఇతను చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమార్తెకు నాగై జిల్లా నాగూర్, తెత్తి గ్రామానికి చెందిన దురై కుమారుడు కన్నాభిరాన్తో శుక్రవారం ఈ వివాహం జరగవలసి ఉంది. గురువారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. వధువు వివాహ మండపానికి చేరుకుంది.
కానీ వరుడు, వరుని తరపున బంధువులు పెళ్లి మండపానికి చేరుకోలేదు. దీని గురించి వధువు తండ్రి వరుని తండ్రికి ఫోన్ చేసి సంప్రదించగా కుమారుడు కనబడడం లేదని తెలిపారు. అయినప్పటికీ వరుని తరపున వారు వస్తారనే నమ్మకంతో వివాహ ఏర్పాటు కొనసాగించారు. కానీ వివాహ ముహూర్తం సమయం వరకు వరుని కుటుంబికులు, వరుడు రాలేదు.
విచారణలో వివాహం ఇష్టంలేదని వరుడు కన్నాభిరామన్ అదృశ్యమైనట్టు తెలిసింది. ప్లస్టూ వరకు చదివి దుబాయిలో పని చేస్తూ వివాహం కోసం సొంత ఊరికి వచ్చినట్టు తెలిసింది. దీంతో కుమారుడు కనబడలేదని దురై నాగూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడు లేకపోవడంతో శుక్రవారం జరగవలసిన వివాహం ఆగిపోవడంతో ఆగ్రహం చెందిన ఢిల్లీ దీనిపై పట్టాభిరామం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.