దోష పరిహారమని అత్యాచారం..
కొడుకు మూర్చ రోగం నయం కోసం వెళ్లిన తల్లిపై అత్యాచారం..
► బెంగళూరులో ఘరానా జ్యోతిష్యుని అరెస్టు
బెంగళూరు: కుమారుని మూర్చరోగం నయం చేస్తానని నమ్మించి తల్లిపై అత్యాచారానికి పాల్పడి, భారీగా డబ్బు, బంగారం కాజేసిన కామాంధ జ్యోతిష్యుణ్ని బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు విజయనగరలోని ఆర్పీసీ లేఔట్ కు చెందిన 35 ఏళ్ల మహిళకు 10 నెలల కొడుకు ఉన్నాడు. చిన్నారికి మూర్ఛ లక్షణాలు కనిపించేవి. కనకపురకు చెందిన జ్యోతిష్యుడు ప్రసన్నకుమార్ అలియాస్ కార్తీక్ విజయనగరలో ఓ గదిని అద్దెకు తీసుకుని జ్యోతిష్యం చెబుతుండేవాడు. బాధితురాలు చిన్నారిని చూపిద్దామని జ్యోతిష్యున్ని కలిసింది. జ్యోతిష్యుడు మహిళకు శారీరక లోపం ఉందని నమ్మించి ఆమె నగ్న ఫోటోలను తీశాడు.
తనతో గడిపితే దోషం పోతుందని నమ్మించి ఆమెపై ఏడుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బంగారం, నగదు దానం చేస్తే కుమారుడి జబ్బు నయమవుతుందని ఆమె నుంచి రెండు బంగారునెక్లెస్లు, రెండు చైన్లు, ఆరు చెవికమ్మలు, మూడు చేతి ఉంగరాలు లాక్కున్నాడు. వీటితో పాటు రూ.20 లక్షల 70 వేల నగదు కూడా తీసుకున్నాడు. తరువాత అడ్రస్ లేకుండాపోయాడు. బాధితురాలు మోసపోయానని గ్రహించి వారం క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి సోమవారం నిందితుణ్ని అరెస్టు చేశారు. ఇతడిపై అత్యాచారం, వంచన, దోపిడీ కేసులు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.