ఐపీఎస్ అధికారిపై టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
'సీఎంగా రాజీనామా చేసి పంచాయితీలు చేసుకోండి'
Mar 27 2017 3:49 PM | Updated on Aug 14 2018 11:26 AM
విజయవాడ: ఐపీఎస్ అధికారిపై టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ.. ‘‘ ఐపీఎస్ అధికారిపై దౌర్జన్యం చేయడంతో పాటు ఆయన గన్మెన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసినప్పుడు, నేడు రవాణా శాఖ అధికారులపై ఎమ్మెల్యే, ఎంపీలు దాడి చేసినప్పుడు ముఖ్యమంత్రి రాజీకుదర్చడం చూస్తుంటే.. రౌడియిజాన్ని చంద్రబాబు పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. పంచాయితీలు చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పంచాయితీలు చేసుకోవాలి. నిన్న జరిగిన ఘటనలో క్షమాపణలు కాదు, క్రైం జరిగింది.. కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ పై కేసు నమోదు చేయాలి.
అధికారపార్టీ నేతలను ఒకరకంగా ప్రతిపక్షనేతలను మరో రకంగా ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదు. అసెంబ్లీ సమావేశాలు జుగుప్సాకరంగా జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు చర్చకు కూడా రావడం లేదు. సభలో జరుగుతున్న తిట్ల పురాణం సిగ్గుగా ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను విస్మరించడం బాధాకరం. ప్రత్యేక హోదాపై గతంలో రెండు సార్లు తీర్మానం చేసినా ప్రయోజనం లేకపోవడం అధికార ప్రతిపక్ష పార్టీల చిత్తశుద్ధి తెలుస్తోంది' అని అన్నారు.
Advertisement


