నేటి నుంచి ఆస్కా వజ్రోత్సవాలు | andhra social culture association diamond jubliee celebrations kicks off | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆస్కా వజ్రోత్సవాలు

Aug 31 2013 4:07 AM | Updated on Sep 1 2017 10:17 PM

వజ్రోత్సవాలకు ఆస్కా ముస్తాబైంది. శనివారం నుంచి రెండు రోజులు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు.

వజ్రోత్సవాలకు ఆస్కా ముస్తాబైంది. శనివారం నుంచి రెండు రోజులు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు.
 
సాక్షి, చెన్నై: చెన్నైలో తెలుగుకు చిరునామాగా ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) విరాజిల్లుతోంది. సినీ ప్రముఖులతో 1952 ఏప్రిల్ 24న ఆవిర్భవించిన ఆస్కా దినదినాభివృద్ధి చెందింది. ఆరంభంలో తెలుగువారి పిచ్చాపాటి కబుర్లకు వేదికైన సంస్థ తర్వాత తెలుగుకు చిరునామాగా మారింది. ప్రస్తుతం 3700 మందికిపైగా సభ్యుల్ని కలిగిన ఆస్కా వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకలు శని, ఆదివారాల్లో ఆస్కా ఆవరణలో జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను ఆస్కా కార్యవర్గం సిద్ధం చేసింది. గోదావరి హాల్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడారు. వజ్రోత్సవ ఏర్పాట్లు, హాజరుకానున్న ప్రముఖులు తదితరాల గురించి వివరించారు.
 
నేటి నుంచి వేడుకలు: శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆస్కా ఆవరణలో వేడుకలు ఆరంభం కానున్నాయి. ముందుగా ఒడిశ్శాకు చెందిన ది ప్రిన్స్ బృందం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన జరగనుంది. రాత్రి 7.30 గంటలకు వేడుకల్ని గవర్నర్ కొణిజేటి రోశయ్య లాంఛనంగా ప్రారంభి స్తారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు కనుమూరి బాపిరాజు ప్రత్యేక అతిథులు గా హాజరుకానున్నారు. ఆస్కాకు సేవలు అందించిన మాజీ అధ్యక్ష, కార్యదర్శులను ఎనిమిది గంటలకు సత్కరిస్తారు. రెండో రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శివమణి డ్రమ్స్‌తో వేడుకలు ఆరంభమవుతారుు. అనంతరం జరిగే కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ రాయపాటి సాంబశివరావు, సినీ నటుడు కార్తీ హాజరుకానున్నారు. చివరగా ఆస్కాకు విశిష్ట సేవల్ని అందించిన, అందిస్తున్న వారికి సత్కారం ఉంటుంది.
 
భారీ ఎత్తున చేద్దామనుకున్నాం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల్ని ఆహ్వానించి వజ్రోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాలని తొలుత నిర్ణయించామని ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని వీడాల్సి వచ్చిందన్నారు. అలాగే సంస్థ పరిమితులకు లోబడి సభ్యులందరి అభిప్రాయం మేరకు ఆస్కా ఆవరణలోనే వేడుకలకు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ వేడుకలో సభ్యులందరి చిరునామా, ఫోన్ నెంబర్లతో కూడిన డెరైక్టరీ, సావనీర్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల పిల్లల భవిష్యత్తు, సంక్షేమార్థం విద్యా నిధి ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. 
 
ఆస్కా అభివృద్ధి, విశిష్ట సేవల్ని చాటుతూ ప్రత్యేక డాక్యుమెంటరీ సిద్ధం చేశామన్నారు. ఇందులో మాజీ అధ్యక్షుల ఇంటర్వ్యూలను క్రోడీకరించామని వెల్లడించారు. వజ్రోత్సవ  వేడుకలకు హాజరుకావాలని అందరికీ ఆహ్వానాలు, ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్ పంపామన్నారు. తమకు ఆహ్వానం అందలేదని ఎవరూ భావించవద్దని, ఈ సమావేశం వేదికగా అందరికీ పేరుపేరున ఆహ్వానం పలుకుతున్నానని పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ లక్ష్యంగా తెలుగు సంఘాలతో కలసి ఆస్కా పనిచేస్తోందన్నారు. ఇక మీదట తెలుగు సంఘాలన్నీ ఉగాది, తదితర వేడుకల్ని ఒకే వేదిక మీద నుంచి జరుపుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
ఆస్కా గీతం
ఆస్కా సంస్థకు ప్రత్యేక ప్రార్థనా గీతాన్ని సిద్ధం చేసినట్లు సాంస్కృతిక విభాగం కార్యదర్శి ఘంటసాల రత్నకుమార్ తెలిపారు. అరవై ఏళ్ల ఆస్కా ప్రస్థానాన్ని ఇనుమడింపజేసేలా ఈ గీతం ఉంటుందని వివరించారు. ఇకపై ఆస్కాలో జరిగే ప్రతి కార్యక్రమం ఈ గీతాలాపనతో ప్రారంభమవుతుందన్నారు. 
 
వజ్రోత్సవాల్లో స్వాగత గీతంగా దీనిని ఆలపించనున్నామన్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు సాలూరి వాసురావు స్వర పరచగా, ప్రఖ్యాత సినీ గేయ రచయిత వెన్నెలకంటి ఈ గీతాన్ని రచించారన్నారు. ఈ సమావేశంలో ఆస్కా కార్యదర్శి రావి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement