అశోక్ చవాన్‌కు ఊరట | Adarsh Society scam: Relief for Ashok Chavan, Governor refuses permission to prosecute him | Sakshi
Sakshi News home page

అశోక్ చవాన్‌కు ఊరట

Dec 19 2013 12:24 AM | Updated on Jul 26 2019 5:53 PM

ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ చేసిన విన్నపాన్ని గవర్నర్ శంకర నారాయణన్ బుధవారం తిరస్కరించారు.

ముంబై/న్యూఢిల్లీ : ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ చేసిన విన్నపాన్ని గవర్నర్ శంకర నారాయణన్ బుధవారం తిరస్కరించారు. దీంతో ఆయనపై కేసు మూసివేయడం తప్ప సీబీఐకి మరో మార్గం లేకుండా పోయింది.
 
 ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్పట్లో  ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వరిస్తున్న అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ మొత్తం 12 మందిపై కోర్టులో అభియోగాలు నమోదుచేసింది. అయితే తన పేరును నిందితుల జాబితాలో చేర్చడాన్ని అశోక్ కోర్టులో సవాలుచేశారు. తనను విచారించేందుకు గవర్నర్ వద్ద నుంచి సీబీఐ అనుమతి పొందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. అభియోగాలు మోపిన సమయంలో ఆయన సీఎంగా లేరని వాదించింది. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అనుమతి పొందాల్సిందేనంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలని గవర్నర్‌ను సీబీఐ అభ్యర్థించింది. అయితే అందుకు ఆయన నిరాకరించారు.
 
 మరో మార్గమేమీ లేదు
 ఈ విషయమై సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఇందుకు
 సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలను సమగ్రంగా నివేదించాం. అయితే ప్రస్తుతం తమకు న్యాయపరంగా మరో మార్గమేమీ లేదు. అందువల్ల కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.’ అని అన్నారు.
 
 తొలిసారేమీ కాదు
 సంబంధిత యంత్రాంగం అనుమతి లభించని కారణంగా శక్తిమంతులైన మంత్రులపై మోపిన కేసులు వీగిపోవడం ఇది తొలిసారేమీ కాదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజ్ కారిడార్ ప్రాజెక్టు కుంభకోణం కేసుకు సంబంధించి మాయావతిపై కేసు నమోదు చేశామని, అయితే అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ టి.వి.రాజేశ్వర్ అనుమతించలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో కేసు మూసేయక తప్పలేదన్నారు. ఇక అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంతా పై లెటర్ ఆఫ్ క్రెడిట్ స్కాం (ఎల్‌ఓసీ) కేసునమోదైందని, ఆనాటి ఆ రాష్ట్ర గవర్నర్ మహంతను విచారించేందుకు నిరాకరించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement