జీతాల సమస్య పరిష్కారం! | Windies settle pay dispute | Sakshi
Sakshi News home page

జీతాల సమస్య పరిష్కారం!

Feb 16 2016 12:16 AM | Updated on Sep 3 2017 5:42 PM

జీతాల చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ), ఆటగాళ్లకు మధ్య తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు...

కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన 12 మంది విండీస్ ఆటగాళ్లు
సెయింట్ జాన్స్: జీతాల చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ), ఆటగాళ్లకు మధ్య తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు పరిష్కారమైంది. బోర్డు తాజా కాంట్రాక్ట్‌పై 12 మంది క్రికెటర్లు సంతకాలు కూడా చేశారు. దీంతో టి20 ప్రపంచకప్‌లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. అయితే డారెన్ బ్రేవో మాత్రం టెస్టులపై దృష్టిపెట్టేందుకు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. గేల్, స్యామీ, బెన్, హోల్డర్, ఫ్లెచర్, బ్రేవో, బద్రీ, సిమ్మన్స్, టేలర్, రస్సెల్, శామ్యూల్స్, రామ్‌దిన్ సంతకాలు చేసిన వారిలో ఉన్నారని విండీస్ బోర్డు తెలిపింది.

ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న పొలార్డ్ (గాయం), నరేన్ (సందేహాస్పద బౌలింగ్)ల స్థానంలో ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే డారెన్ స్థానంలో త్వరలోనే మరొకర్ని తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.
 
ఐసీసీ నుంచి ఒత్తిడి లేదు: పాక్
కరాచీ: భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనాల్సిందిగా ఐసీసీ నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ అనుమతిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉందని తేల్చింది. టోర్నీ నుంచి వైదొలిగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఇటీవల హెచ్చరించినట్టు కథనాలు వెలువడడంతో పీసీబీ స్పందించింది.

‘ఐసీసీ నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ఇటీవలి సమావేశంలోనూ భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై చర్చించాం. ఇదే కారణంగా పాక్ ప్రభుత్వం జట్టుకు అనుమతినివ్వకపోతే పీసీబీ చేసేదేం లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఏ విషయమూ తేల్చలేదు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement