డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.
అమెరికా మీడియా సంస్థ సీఎన్బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.
ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.
దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు.


