భారత్‌కు ఎదురుందా? | West Indies's last chance to stay alive in series | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎదురుందా?

Jun 30 2017 1:56 AM | Updated on Sep 5 2017 2:46 PM

భారత్‌కు ఎదురుందా?

భారత్‌కు ఎదురుందా?

బలహీన వెస్టిండీస్‌పై స్పష్టమైన ఆధిక్యం కోసం భారత జట్టు మూడో వన్డే బరిలోకి దిగుతోంది.

వెస్టిండీస్‌తో నేడు మూడో వన్డే
సోనీ సిక్స్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం  


నార్త్‌ సౌండ్‌ (అంటిగ్వా): బలహీన వెస్టిండీస్‌పై స్పష్టమైన ఆధిక్యం కోసం భారత జట్టు మూడో వన్డే బరిలోకి దిగుతోంది. నేడు (శుక్రవారం) ఇరు జట్ల మధ్య అంటిగ్వాలోని వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోయినా రెండో వన్డేలో భారత్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం 1–0 ఆధిక్యంలో ఉంది. ఆ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ భారత్‌ 105 పరుగుల తేడాతో నెగ్గి విండీస్‌కన్నా తాము ఎంత మెరుగైన స్థాయిలో ఉన్నామో చాటి చెప్పింది.

టాప్‌ ఆర్డర్‌ అద్భుత బ్యా టింగ్‌కు తోడు బౌలర్లు పిచ్‌ను సద్వినియో గం చేసుకుని చెలరేగడంతో విండీస్‌ గడ్డపై తొలిసారిగా భారీ తేడాతో నెగ్గి రికార్డు సృష్టించింది. ఇక ఈ మ్యాచ్‌ కోసం కూడా జట్టు ఆటగాళ్లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావీ యకుండా నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రత్యర్థి పరిస్థితి ఎలా ఉన్నా సిరీస్‌ విజయంతో సత్తా చాటుకోవాలని భారత్‌ భావిస్తోంది.

అన్నింట్లోనూ టాప్‌
భారత బ్యాటింగ్‌ బలం ఎలా ఉందంటే మ్యాచ్‌ దాదాపు టాప్‌ ఆర్డర్‌ సూపర్‌ షోతోనే ముగుస్తోంది. దీంతో మిడిలార్డర్‌కు ఎక్కువ సేపు క్రీజులో నిలిచే అవకాశం దక్కడం లేదు. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఈ విభాగం కేవలం రెండుసార్లు మాత్రమే 40 బంతుల వరకు ఎదుర్కోగలిగింది. రోహిత్‌ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్‌ రహానే విండీస్‌ పర్యటనను చక్కగా వినియోగించుకుంటున్నాడు. వరుసగా 62, 103 స్కోర్లతో దూసుకెళుతున్నాడు. అటు ధావన్‌ కూడా తన బ్యాటింగ్‌తో జట్టుకు భారీ శుభారంభాన్ని అందివ్వగలుగుతున్నాడు.

ధోని, పాండ్యా, జాదవ్‌ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. ఆందోళనంతా యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌ ఫామ్‌పైనే ఉంది. ఒకవేళ అతన్ని తప్పిస్తే అదనపు స్లో బౌలర్‌గా రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశాలను తీసిపారేయలేం. లేకుంటే యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు చోటు కల్పిస్తారా అనేది వేచిచూడాల్సిందే. బౌలింగ్‌లో పేసర్‌ భువనేశ్వర్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండగా ఉమేశ్‌ మెరవాల్సి ఉంది.

విండీస్‌లో రెండు మార్పులు
భారత్‌కు ఏమాత్రం సరితూగే స్థితిలో లేని విండీస్‌ మిగిలిన మూడు వన్డేల కోసం జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కార్టర్, విలియమ్స్‌లను తప్పించి బ్యాట్స్‌మెన్‌ కైల్‌ హోప్, సునీల్‌ అంబ్రిస్‌లను జట్టులోకి తీసుకుంది. దీంతో వీరు తొలిసారిగా జట్టు తరఫున ఆడనున్నారు. ఈ మార్పులతోనైనా విజయం దక్కించుకోవాలని జట్టు ఆశిస్తోంది. తద్వారా వన్డే ప్రపంచకప్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో షాయ్‌ హోప్, చేజ్, పావెల్‌లపై ఆధారపడుతున్న ఈ జట్టు బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తోంది.

పిచ్‌
ఈ మైదానంలో జరిగిన 15 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు సగటున ఓవర్‌కు చేసిన పరుగులు 5.05 మాత్రమే. పెద్దగా భారీ స్కోర్లకు అవకాశం లేదు. తేలికపాటి జల్లు కురిసే అవకాశం ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేదు.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రహానే, ధావన్, యువరాజ్, ధోని, పాండ్యా, జాదవ్, కుల్దీప్, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్‌ యాదవ్‌.
విండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), లూయిస్, హోప్, షాయ్‌ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్‌ / అంబ్రిస్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement