మా ఆట నచ్చడం లేదా... | Virat Kohli for his leave country comment | Sakshi
Sakshi News home page

మా ఆట నచ్చడం లేదా...

Nov 9 2018 1:24 AM | Updated on Nov 9 2018 1:24 AM

Virat Kohli for his leave country comment - Sakshi

ముంబై: గత కొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అనూహ్యంగా తన వ్యాఖ్యతో ఇబ్బందికర పరిస్థితిని సృష్టించుకున్నాడు.తనకొత్త యాప్‌ ప్రమోషన్‌లో భాగంగా అభిమాని మాటలకు ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నంలో రచ్చకు ఆహ్వానం పలికాడు. కోహ్లితో సంభాషణలో భాగంగా ఒకఅభిమాని ‘నా దృష్టిలో కోహ్లి అంత గొప్ప బ్యాట్స్‌మన్‌ ఏమీ కాదు. అతని గురించి అనవసరంగా గొప్పగా చెబుతున్నారు. నేను వీరికంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ఆటగాళ్ల బ్యాటింగ్‌ చూడటానికే ఎక్కువ ఇష్టపడతాను’ అని ఆ అభిమాని అన్నాడు.

దీనిపై కోహ్లి గట్టిగానే స్పందించాడు. ‘అలా అయితే నువ్వు భారత్‌లో ఉండటం అనవసరం.ఇక్కడ ఉంటూ  పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చు కదా. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రంఇక్కడఉండరాదనేది నా అభిప్రాయం. నీ ప్రాధాన్యతలేమిటో ముందుగా తెలుసుకో’ అని బదులిచ్చాడు. ఈ వీడియోపై అన్ని వైపులనుంచి కోహ్లిపై విమర్శలువచ్చాయి.

కోహ్లి అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వచ్చింది కాబట్టి ఇది అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదని, కావాలనే కోహ్లి తన అసహనాన్ని ప్రదర్శించాడనేఅభిప్రాయం అందరిలో వినిపించింది. తన ఆటకు, దేశాభిమానానికి ఎలా ముడిపెడ తాడని, కోహ్లి విదేశీ ఆటగాళ్లను అభిమానించలేదా, విదేశీకంపెనీలకు ప్రచారకర్తగా పని చేయడం లేదా అని సోషల్‌ నెట్‌వర్క్‌ వేదికగా అందరూ భారత కెప్టెన్‌పై విరుచుకు పడ్డారు.  

విరాట్‌ వివరణ... 
ముందుగా ట్రోలింగ్‌ను పట్టించుకోని కోహ్లి చివరకు గురువారం దీనిపై వివరణ ఇచ్చాడు. తాను ఆ ఒక్క వ్యక్తి గురించే మాట్లాడినట్లు అతను ట్వీట్‌ చేశాడు. ‘నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. ఈ భారతీయులు అంటూ ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యపైనే నేను స్పందించాను. ఎవరి ఇష్టం వారిదని నేను నమ్ముతాను. పండుగ పూట ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకుండా సరదాగా గడపండి’ అంటూ వ్యాఖ్యానించాడు.

 
మరో వైపు వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు గాయాలపాలు కాకుండా, సరైన విశ్రాంతితో పూర్తి ఫిట్‌గా ఉండేందుకు ఐపీఎల్‌ నుంచి భారత పేస్‌ బౌలర్లను మినహాయించాలని సీఓఏను కోహ్లి కోరినట్లు సమాచారం. అయితే దీనిపై ఫ్రాంచైజీలు అంగీకరించకపోవచ్చని, ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని  కోహ్లికి సీఓఏ తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. ఐపీఎల్‌ ఫైనల్, వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌కు మధ్య 15 రోజుల వ్యవధి ఉందని, ఇంతకంటే ఇంకేం విశ్రాంతి కావాలని మరో బోర్డు అధికారి అభిప్రాయ పడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement