
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ జోడి వచ్చే డిసెంబర్ నెలలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డిసెంబర్ చివరి వారంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందుగానే కోహ్లి వివాహం చేసుకోవాలని భావించాడట. దానిలో భాగంగానే వచ్చే నెలలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనకు కోహ్లికి విశ్రాంతినిద్దామని బీసీసీఐ సెలక్టర్లు భావించినా, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టేశారు. కోహ్లికి రెస్ట్ ఇచ్చే అంశం ఇంకా బీసీసీఐ పరిశీలనలో ఉంది. ఒకవేళ లంకతో సిరీస్ కు కోహ్లికి విశ్రాంతి దొరికిన పక్షంలో డిసెంబర్ తొలి వారంలోనే అతని వివాహం ఉండవచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.