విజేతలు విఘ్నయ్, నిఖత్‌ బాను

Vighnay, Nikhat Bani won TT titles - Sakshi

స్టేట్‌ ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఎంవీ శ్రీధర్‌ స్మారక స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆర్‌బీఐ ప్లేయర్లు నిఖత్‌ బాను, విఘ్నయ్‌ రెడ్డి విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో విఘ్నయ్‌ రెడ్డి 4–2తో బి. వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ)పై, మహిళల టైటిల్‌ పోరులో నిఖత్‌ బాను 4–0తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌)పై గెలుపొందారు. యూత్‌ బాలికల ఫైనల్లో జి. ప్రణీత 4–1తో నైనా (ఎల్బీ స్టేడియం)పై, బాలుర ఫైనల్లో వరుణ్‌ శంకర్‌ 4–0తో పీయూష్‌ అగర్వాల్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలుపొందారు.

ఎంఎల్‌ఆర్‌కు చెందిన కేశవన్‌ కన్నన్‌ సబ్‌ జూనియర్, జూనియర్‌ బాలుర విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. సబ్‌ జూనియర్‌ బాలుర ఫైనల్లో కేశవన్‌ 4–3తో కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది, జూనియర్‌ బాలుర ఫైనల్లో కేశవన్‌ 4–1తో వరుణ్‌ శంకర్‌ను ఓడించాడు. జూనియర్‌ బాలికల తుదిపోరులో లాస్య (ఏడబ్ల్యూఏ) 4–3తో ఎన్‌. అంజలి (జీఎస్‌ఎం)పై, సబ్‌ జూనియర్‌ బాలికల తుదిపోరులో భవిత (జీఎస్‌ఎం) 4–0తో విధి జైన్‌     (జీఎస్‌ఎం)పై గెలుపొంది చాంపియన్‌లుగా నిలిచారు. క్యాడెట్‌ బాలబాలికల సింగిల్స్‌ విభాగంలో జతిన్‌దేవ్‌(ఎస్‌పీహెచ్‌ఎస్‌), నిఖిత టైటిళ్లను సొంతం చేసుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top