29 బంతుల్లోనే కథ ముగించారు | Under 19 World Cup Indian Team Beat Japan By 10 Wickets | Sakshi
Sakshi News home page

29 బంతుల్లోనే కథ ముగించారు

Jan 21 2020 7:58 PM | Updated on Jan 21 2020 10:15 PM

Under 19 World Cup Indian Team Beat Japan By 10 Wickets - Sakshi

అనంతరం బరిలోకి దిగిన యువభారత్‌ జట్టు 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.

బ్లోమ్‌ఫొంటెన్‌: అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జపాన్‌ను చిత్తు చేసింది. జపాన్‌ నిర్దేశించిన అతి స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జపాన్‌ రవి భిష్నోయ్‌ 4, కార్తిక్‌ త్యాగి 3 దెబ్బకు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన యువభారత్‌ జట్టు 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (18 బంతుల్లో 29; 5 పోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కుశాగ్ర (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు.
(చదవండి : చెత్త ప్రదర్శన.. 41 పరుగులకే ఆలౌట్‌)

భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్‌  భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవి భిష్నోయ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. కాగా, భిష్నోయ్‌పై బీసీసీఐ ప్రశంసలు కురిపించింది. చక్కని బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి భారత్‌ విజయానికి బాటలు వేశాడని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక న్యూజిలాండ్‌తో మూడో లీగ్‌ మ్యాచ్‌ శుక్రవారం జరుగనుంది.

41లో ఎక్స్‌ట్రాలే 19..
జపాన్‌ బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురు డకౌట్‌ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్‌ డక్‌గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్‌ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్‌ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో వికెట్‌కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్‌ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం.
(చదవండి : యువ భారత్‌ శుభారంభం)

Advertisement
 
Advertisement
Advertisement