భారత్‌లో అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ | under-17 world cup foot ball tournment in india | Sakshi
Sakshi News home page

భారత్‌లో అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ

Dec 6 2013 1:17 AM | Updated on Sep 2 2017 1:17 AM

ఎట్టకేలకు ఫుట్‌బాల్‌కు సంబంధించి ఓ మెగా ఈవెంట్ భారత్‌లో జరగనుంది. 2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఫుట్‌బాల్‌కు సంబంధించి ఓ మెగా ఈవెంట్ భారత్‌లో జరగనుంది. 2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సాకర్ టోర్నమెంట్‌ను నిర్వహించే భాగ్యం పొందడం భారత్‌కు ఇదే తొలిసారి. బ్రెజిల్‌లో గురువారం జరిగిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 24 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్‌లను న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహటి, మార్గోవా, కొచ్చి, బెంగళూరు నగరాల్లో నిర్వహిస్తారు. బిడ్డింగ్‌లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉజ్బెకిస్థాన్‌లు పోటీపడగా భారత్ ఈ మూడు దేశాల్ని అధిగమించి ఆతిథ్య అవకాశాన్ని పొందింది. గతంలో భారత్ ఆసియా అండర్-20 ఫెడరేషన్ కప్ (2006), ఏఎఫ్‌సీ చాలెంజ్ కప్ (2008)లను నిర్వహించినప్పటికీ ఫిఫా కప్‌కు మాత్రం ఎప్పుడూ ఆతిథ్యమివ్వలేదు.
 
 
  తొలుత ప్రభుత్వ గ్యారంటీ, పన్ను మినహాయింపుల నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో జనవరిలో దాఖలు చేసిన ప్రాథమిక బిడ్ తిరస్కరణకు గురైంది. తదనంతరం భారత ప్రభుత్వం నుంచి కూడా మద్దతు లభించడంతో గత నవంబర్‌లో బిడ్ దాఖలు చేశారు. దీంతో పాటు ‘ఫిఫా’ అండదండలు లభించడంతో బిడ్డింగ్‌లో భారత్ నెగ్గగలిగింది. ఈ టోర్నీతో భారత్‌లోనూ ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యం పెరుగుతుందని ‘ఫిఫా’ అధ్యక్షుడు బ్లాటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement