
సిరిల్ వర్మ కొత్త చరిత్ర
తన కోచ్ పుల్లెల గోపీచంద్, అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్లాంటి వారితో ...
ప్రపంచ జూ. బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి
బాలుర సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు
హైదరాబాద్: తన కోచ్ పుల్లెల గోపీచంద్, అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్లాంటి వారితో సాధ్యంకానిది తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ సాధించాడు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ బాలుర సింగిల్స్ విభాగంలో ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా అతను గుర్తింపు పొందాడు. పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 15 ఏళ్ల సిరిల్ వర్మ నిలకడగా రాణిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో సిరిల్ వర్మ 21-15, 21-14 స్కోరుతో 14వ సీడ్ అదుల్రాచ్ నమ్కుల్ (థాయ్లాండ్)పై విజయం సాధించాడు. అన్సీడెడ్గా ఈ పోటీల్లో బరిలోకి దిగిన సిరిల్ ఫైనల్ చేరుకునే క్రమంలో నలుగురు సీడెడ్ క్రీడాకారులను ఓడించడం విశేషం. ఫైనల్లో ఆరో సీడ్ చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ)తో సిరిల్ తలపడతాడు.
1992లో మొదలైన ప్రపంచ జూనియర్ బ్యాడ్మిం టన్ చాంపియన్షిప్ చరిత్రలో ఓవరాల్గా భారత్కు ఇప్పటి వరకు ఆరు పతకాలు వచ్చాయి. బాలుర సింగిల్స్ విభాగంలో గురుసాయిదత్ (2008లో), భమిడిపాటి సాయిప్రణీత్, ప్రణయ్ (2010లో)... సమీర్ వర్మ (2011లో) సెమీఫైనల్లో నిష్ర్కమించి కాంస్య పతకాలు నెగ్గారు. బాలికల సింగిల్స్ విభాగంలో 2008లో సైనా నెహ్వాల్ విజేతగా నిలువగా... 1996లో అపర్ణ పోపట్ రన్నరప్గా నిలిచింది.