స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్లో అక్రమాలు | Sports quota entries for corruption | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్లో అక్రమాలు

Oct 6 2013 12:12 AM | Updated on Aug 17 2018 3:08 PM

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌లో స్పోర్ట్ కోటా ద్వారా జరిగే అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో శాప్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) ఆరోపించింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌లో స్పోర్ట్ కోటా ద్వారా జరిగే అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో శాప్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) ఆరోపించింది.
 
 ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ఎ.పి.జితేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కె.రంగారావు, కోశాధికారి బి.కె.హరినాథ్, సంయుక్త కార్యదర్శి పి.మల్లారెడ్డి, కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి  కె.పిరావులతో కలిసి ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడారు.
 
 
 ఎంబీబీఎస్, అగ్రికల్చర్, బీడీఎస్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్)ఎండీ చైర్మన్‌గా, ఎనిమిది మంది సభ్యులచే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న, పతకాలను గెలిచిన ఆటగాళ్ల క్రీడల ధృవీకరణ పత్రాలపై, కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను శాప్ అధికారులు నివృత్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే తమను సంప్రదించకుండానే తుది జాబితాను యూనివర్సిటీకి అందజేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
 
  అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో జారీ చేసిన సంబంధిత సరిఫికెట్లు లేకున్నా వారికి మినహాయింపు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సెయిలింగ్, రోలర్ స్కేటింగ్ క్రీడల పేరుతో మెడికల్ సీట్లను కొందరు బోగస్ క్రీడాకారులు పొందారని విమర్శించారు. మెడికల్ సీట్లలో 2011 నుంచి జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీచే విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 అవాస్తవం: డాక్టర్ మోహన్
 స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల భర్తీలో తనపై వచ్చిన ఆరోపణలను శాప్ మాజీ డిప్యూటీ డెరైక్టర్, ప్రస్తుత పైకా సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్ ఖండించారు. గతంలో జాతీయ క్రీడా సమాఖ్య సమర్పించిన ధృవీకరణ పత్రాల ఆధారంగా మెడికల్ సీట్లను కేటాయించినట్లు ఆయన చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement