రయ్యాన్‌ ఆరు గోల్స్‌... | Sohails Six Goals takes Telangana into semis of football championship | Sakshi
Sakshi News home page

రయ్యాన్‌ ఆరు గోల్స్‌...

Feb 19 2019 10:32 AM | Updated on Feb 19 2019 10:32 AM

Sohails Six Goals takes Telangana into semis of football championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ ఇండియా కప్‌ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటగాడు రయ్యాన్‌ బిన్‌ సొహైల్‌ గోల్స్‌ వర్షం కురిపించాడు. వరుసగా ఆరు గోల్స్‌తో చెలరేగి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఫలితంగా స్కూల్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 6–1తో ఛత్తీస్‌గఢ్‌పై ఘనవిజయం సాధించింది. నెమ్మదిగా మ్యాచ్‌ను ఆరంభించిన తెలంగాణ క్రమక్రమంగా పుంజుకుంది. మ్యాచ్‌ 27వ నిమిషంలో రయ్యాన్‌ చేసిన తొలి గోల్‌తో తెలంగా ణ ఖాతా తెరిచింది. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

మరో రెండు నిమిషాల్లోనే ఛత్తీస్‌గఢ్‌ ఆటగాడు ఎం. కృష్ణ గోల్‌ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. తర్వాత ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడటంతో తొలి అర్ధభాగం 1–1తో ముగిసింది. రెండో అర్ధభాగంలో రయ్యన్‌ విజృంభించాడు. వరుసగా ఐదు గోల్స్‌తో ప్రత్యర్థి్థకి ముచ్చెమటలు పట్టించాడు. మ్యాచ్‌ 43వ నిమిషంలో నవీన్‌ అందించిన పాస్‌ను రయ్యాన్‌ అద్భుతమైన హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో తెలంగాణ 2–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత 53వ, 59వ, 66వ, 70వ నిమిషాల్లో రయ్యాన్‌ గోల్స్‌ చేసి జట్టుకు ఘనవిజయం అందించాడు. అద్భుత ప్రదర్శనతో చెలరేగిన రయ్యాన్‌ బిన్‌ సొహైల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు. నేడు జరిగే తొలి సెమీస్‌లో పంజాబ్‌తో తెలంగాణ... రెండో సెమీస్‌లో హరియాణాతో పశ్చిమ బెంగాల్‌ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement