విలియమ్సన్‌ నిర్ణయమే కొంప ముంచిందా?

Should Bhuvneshwar Kumar Have Bowled The 19th Over - Sakshi

ఆ ఓవర్‌ కౌల్‌ లేక సందీప్‌ వేసుంటే

19 ఓవర్‌ భువీ వేసినా..

ముంబై : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు వికెట్లతో నెగ్గి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే సన్‌రైజర్స్‌ ఓటమికి సారథి కేన్‌ విలియమ్సన్‌ నిర్ణయమే కారణమని సోషల్‌ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఓ దశలో చెన్నై విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరం కాగా.. క్రీజులో డుప్లెసిస్‌ మినహా మేటి బ్యాట్స్‌మన్‌ ఎవరు లేరు. పైగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలున్నారు. దీంతో సన్‌రైజర్స్‌ విజయం కాయం అని అందరు భావించారు. 

అందరు అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్‌ ఎందుకు అవుతుందన్నట్లు.. 18 ఓవర్‌లో మ్యాచ్‌ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లకు కాకుండా బంతిని బ్రాత్‌ వైట్‌కు ఇచ్చాడు. ఇంకేముంది క్రీజులో పాతుకుపోయిన డుప్లెసిస్‌ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 20 పరుగులు పిండుకొని మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అయితే ఈ ఓవర్‌ను కౌల్‌, భువీ, సందీప్‌లో ఏ ఒక్కరు వేసి.. కట్టడి చేసినా.. మ్యాచ్‌ సన్‌ వశమయ్యేదని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓవర్‌ కట్టడైతే పరుగుల కోసం చెన్నై ఒత్తిడికి గురై వికెట్ల సమర్పించుకునేదని పేర్కొంటున్నారు. కనీసం 19వ ఓవరైనా భువీకిస్తే అవకాశం ఉండేదని వాపోతున్నారు. టోర్నీ ఆసాంతం అద్భుత కెప్టెన్సీతో రాణించిన విలియమ్సన్‌ కీలక మ్యాచ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

కొట్టాడు.. ఇచ్చాడు!
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్‌ అంతా విఫలమవ్వగా.. చివర్లో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (29 బంతుల్లో 43 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. శార్ధుల్‌ ఠాకుర్‌ వేసిన 20వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ రెండు సిక్స్‌లతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. అదే బ్రాత్‌వైట్‌ చెన్నై ఇన్నింగ్స్‌లో 18 ఓవర్‌లో బంతితో అవే 20 పరుగులిచ్చి సన్‌రైజర్స్‌ ఓటమికి కారణమయ్యాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top