
ఆచంట శరత్ కమల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజాగా విడుదల చేసిన పురుషుల టీటీ ర్యాంకింగ్స్లో భారత వెటరన్ ఆచంట శరత్ కమల్ ఏడు స్థానాలు ఎగబాకి 31వ స్థానంలో నిలిచాడు. దాంతో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 సంవత్సరాల తన ఐటీటీఎఫ్ టైటిల్ నిరీక్షణకు గత నెలలో తెరదించుతూ ఒమన్ ఓపెన్లో శరత్ విజేతగా నిలిచాడు. దాంతో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. భారత్కే చెందిన సత్యన్ 32వ ర్యాంకులో ఉన్నాడు. హర్మీత్ దేశాయ్ (72), ఆంటోని అమల్రాజ్ (100), మానవ్ ఠక్కర్ (139) స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో మనికా బాత్రా 63వ స్థానంలో ఉండగా... సుతీర్థ ముఖర్జీ 95వ స్థానంలో నిలిచింది.