డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి భారత్‌ | India moves to sixth position in WTC rankings | Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి భారత్‌

May 21 2026 4:04 AM | Updated on May 21 2026 4:04 AM

India moves to sixth position in WTC rankings

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు భారత్‌ ఐదో స్థానంలో ఉండగా తాజాగా పాకిస్తాన్‌పై 2–0తో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు ముందంజ వేసింది. డబ్ల్యూటీసీ (2025–27)లో భాగంగా ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడిన శుబ్‌మన్‌ గిల్‌ సేన మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్‌ ఖాతాలో మొత్తం 52 పాయింట్లు ఉండగా... పాయింట్ల శాతం (48.15) ప్రకారం ప్రస్తుతం ఆరో స్థానంలో నిలిచింది.

గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో పరాజయం పాలవడం జట్టు ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. 2026లో ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని టీమిండియా... జూన్‌ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో తలపడనుండగా ఈ టెస్టు డబ్ల్యూటీసీలో భాగంగా లేదు. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌లలో జరిగే పర్యటనలు భారత్‌కు కీలకం కానున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా...  దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement