సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి

Shantha Rangaswamy Resigns from CAC And ICA Directorship - Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్‌ 10లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసు రావడంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెపె్టన్‌ శాంత రంగస్వామి... క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) నుంచి ఆదివారం తప్పుకొన్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని సీఏసీలో సభ్యురాలిగా ఉన్న శాంత... ఇటీవల టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికలో పాల్గొన్నారు. దీంతో ఆమె విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తారంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ ఎథిక్స్‌ అధికారికి ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో పదవుల నుంచి శాంత వైదొలగారు. ‘నాకు వేరే ప్రణాళికలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాలి. అయినా, సీఏసీ ఏడాదికో రెండేళ్లకో ఒకసారి సమావేశం అవుతుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనాలు ఏమున్నాయో? సీఏసీలో సభ్యురాలిని కావడం గౌరవంగా భావిస్తున్నా. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టమేమో? ఐసీఏకు దాని ఎన్నికల కంటే ముందే రాజీనామా చేశా’ అని శాంత కాస్త తీవ్రంగా స్పందించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top