క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్‌ | Saina, Sai Praneeth in Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్‌

Jun 1 2017 11:52 PM | Updated on Sep 5 2017 12:34 PM

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాదీ స్టార్‌ సైనా నెహ్వాల్, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాదీ స్టార్‌ సైనా నెహ్వాల్, తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే సౌరభ్‌ వర్మ, సాయి ఉత్తేజితా రావులకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సైనా 21–11, 21–14తో యింగ్‌ యింగ్‌ లీ (మలేసియా)పై అలవోక విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి వరుస గేముల్లో 40 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది.

 క్వార్టర్స్‌లో ఆమె... క్వాలిఫయర్‌ హరుకొ సుజుకి (జపాన్‌)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్‌ ఓపెన్‌ చాంపియన్, మూడో సీడ్‌ సాయిప్రణీత్‌ 21–13, 21–18తో తొమ్మిదో సీడ్‌ ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ (మలేసియా)ను కంగుతినిపించాడు. 12వ సీడ్‌ సౌరభ్‌ వర్మ 16–21, 25–23, 11–21తో ఐదో సీడ్‌ బ్రైస్‌ లెవర్డెజ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత 15–21, 17–21తో పట్టరసుడ చయ్‌వాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో కంగుతింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ డెచపోల్‌ పువరనుక్రొ–సప్సిరి టెరటనచయ్‌ (మలేసియా) జంట 21–10, 21–9తో ప్రజక్తా సావంత్‌ (భారత్‌)–యోగేంద్ర కృష్ణన్‌ (మలేసియా) జోడిని ఓడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement