ఎన్టీటీపీఎస్‌లో క్వార్టర్ల రగడ | Management serious about renting out quarters allotted to NTPS employees to others | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌లో క్వార్టర్ల రగడ

Jun 10 2026 4:55 AM | Updated on Jun 10 2026 4:55 AM

Management serious about renting out quarters allotted to NTPS employees to others

జెన్‌కో హుకుం.. కార్మికుల ఆందోళన

ఖాళీ చేయిస్తారా.. రెండింతలు అద్దె కడతారా? 

ఎన్టీపీఎస్‌ ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్లను  ఇతరులకు అద్దెకు ఇవ్వడంపై యాజమాన్యం సీరియస్‌ 

ఖాళీ చేయించాలంటూ ఉద్యోగులకు నోటీసులు 

వినకపోవడంతో జీతం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ రెండింతలు వసూలుకు సన్నద్ధం 

రాయలసీమ, కృష్ణపట్నంలో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలు

సాక్షి, అమరావతి: డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీటీపీఎస్‌)లో ఉద్యోగుల క్వార్టర్ల వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ఉద్యోగులకు కేటాయించిన క్వార్టర్లను ఇతరులకు అద్దెకు ఇచ్చి, అద్దెకున్న వారిని ఇంకా ఖాళీ చేయించని ఉద్యోగులపై యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది. సూచనలు చేసినప్పటికీ క్వార్టర్లు ఖాళీ చేయకపోవడంతో సంబంధిత ఉద్యోగులు క్వార్టర్‌ పూర్తిగా ఖాళీ చేసేవరకు అధిక అద్దె (పీనల్‌ రెంట్‌) చెల్లించాలని ఏపీ జెన్‌కో ఆదేశించడం ఉద్యోగుల్ని ఆగ్రహానికి గురిచేసింది. నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏకు రెండింతలుగా పీనల్‌ రెంట్‌ వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలని యాజమాన్యం నిర్ణయించడం కలకలం రేపుతోంది.  

ఎందుకంత పంతం 
జెన్‌కో తీరును ప్రశ్నించే యూనియన్‌ నాయకుల పేర్లను సబ్‌ రెంట్‌ లిస్ట్‌లో పెట్టిన అధికారులు, వారికి అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లు మాత్రం ఆ జాబితాలో చూపించడం లేదు. ట్రేడ్‌ యూనియన్లలో పని చేసి రిటైరైన వారు సైతం ఇంకా అక్కడే ఉంటున్నారు. ఆ క్వార్టర్లు కనీసం సబ్‌ రెంట్‌ లిస్టులో కూడా చూపించడం లేదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొంతమంది ట్రేడ్‌ యూనియన్లలో పనిచేస్తున్న కారణంగా వారికి కేటాయించిన క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, ఖాళీ చేయించాలనే లిస్టులో అవి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. 

ఎన్టీపీఎస్‌ కోసం నిత్యం కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు అదే క్వార్టర్స్‌లో ఉంటూ వాటి బాగోగులు చూసుకుంటుంటే వారిని ఖాళీ చేయించాలంటూ ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం వెనుకున్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం న్యాయ సలహా కూడా తీసుకోకుండా తాము చెప్పిందే న్యాయం, చేసేదే చట్టం అనేవిధంగా పరిపాలన విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. సాధారణంగా ఇంటి యజమానులు పాటించే అద్దె చట్టాలను కూడా వారు పాటించడం లేదని, కేవలం తమ పంతం నెగ్గించుకోవడం కోసమే కాంట్రాక్ట్‌ కార్మికులను ఖాళీ చేయించాలని చూస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

మాకే ఎందుకిలా 
ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న కడపలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఆర్‌టీపీపీ), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం(ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో ఈ సమస్య లేదు. అక్కడ జెన్‌కో ఇంజినీర్లు, అధికారుల క్వార్టర్లలో ఉద్యోగులు, సహ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, జెన్‌కో విశ్రాంత ఉద్యోగులు కూడా నివాసం ఉంటున్నారు. ఆ రెండుచోట్లా సబ్‌ రెంట్‌ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. 

ఎన్టీపీఎస్‌లో మాత్రం సబ్‌ రెంట్‌ పేరుతో వేధిస్తూ, ఇంటికి విద్యుత్, నీళ్లు కూడా కట్‌ చేస్తామంటూ రాతపూర్వకంగా హుకుం జారీ చేయడం అన్యాయం అని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాలనీ క్వార్టర్స్‌ మరమ్మతుల పేరుతో రూ.2 కోట్లను పంచేసుకునేందుకు పరిపాలన అధికారులు, వెల్ఫేర్‌ అధికారులు, సివిల్‌ సిబ్బంది అంతా కలిసి బినామీ పేరుతో కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement